15వ ఆర్థిక సంఘం నిధులను మూడంచెల స్థానిక సంస్థలకు పంపిణీ చేయడంపై సీఎం కెసిఆర్ సూచనల మేరకే కేంద్రం ఆమోదం తెలిపిందని, ఆ మేరకు నిధుల వినియోగం కూడా జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. స్థానిక సంస్థల శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పోంచపల్లి శ్రీనివాస్ రెడ్డి మంత్రికి పుష్ప గుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అలాగే సిఎం కెసిఆర్ గారికి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ముందుగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం నిధుల వినియోగం మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీలకు 85శాతం. మండల ప్రజా పరిషత్ లకు 10శాతం, జిల్లా పరిషత్ లకు 5శాతం నిధులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ నిధులతో పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామీణ వ్యవస్థ అభివృధ్ధి చెండానికి వీలవుతుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఇప్పటికే స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి పథకాలతోపాటు ఇతరత్రా నిధులు దండిగా కేటాయిస్తున్నదన్నారు.
కాగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీ విషయమై తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుగారిని కలిసి అభినందించినట్లు చెప్పారు. మన ప్రజాస్వామిక రాజ్యాంగ వ్యవస్థలో పంచాయతీరాజ్ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఉందన్నారు. సిఎం కెసిఆర్ సూచనల మేరకు గ్రామాలకు 85శాతం, మండలాలకు 10శాతం, జిల్లా పరిషత్ లకు 5శాతం నిధులు సముచిత పంపిణీగా పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా పంచాయతీరాజ్ వ్యవస్థకు తోడ్పడతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ గారికి, మంత్రి కెటిఆర్ గారికి, మంత్రి ఎర్రబెల్లి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లిని కలిసిన సమయంలో ఎమ్మెల్సీ పోచంపల్లితోపాటు, హైదరాబాద్ మహానగర మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఉన్నారు.