అక్రమ సంబంధానికి తన భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి చంపింది ఓ భార్య. ఆఫీసు నుండి ఇంటికి వస్తున్నా భర్తకు ఆక్సిడెంట్ చేయించి రోడ్డు ప్రమాదంగా రూపొందించింది. ఈ ఘటన హైదరాబాద్ శివారు మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే....
మేడ్చల్ మండలం సైదోనిగడ్డ తండాకు చెందిన ధరావత్ సురేష్(36)కు బబితతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. సురేష్ ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. బబిత సైదోనిగడ్డ గ్రామ 7వ వార్డు మెంబర్. ఆమెకు కొంతకాలంగా దుండిగల్ తండాకు చెందిన ప్రేమ్సింగ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
అయితే తన బంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపేస్తే ప్రియుడితో హాయిగా ఉండొచ్చని బబిత ప్లాన్ వేసింది. దీంతో ఆ జంట సురేష్ మర్డర్కు ప్లాన్ వేశారు. అజ్మెరప్రేమ్ అనే సుపారీ కిల్లర్తో రూ.లక్షకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ప్రేమ్సింగ్ రూ.70వేలు అడ్వాన్స్ చెల్లించారు.
అజ్మెరప్రేమ్.. తన అనుచరులు రాహుల్, వజ్గోత్ రాజుతో కలిసి నల్గొండ నుంచి స్విఫ్ట్ కారు, డీసీఎం తెప్పించారు. మే 16న యాడారం సమీపంలో రెండుసార్లు హత్యకు యత్నించినా విఫలమైంది. అయితే మే 23న ఆఫీసు నుంచి ఇంటికి బైక్పై వస్తున్న సురేష్ను డీసీఎంతో ఢీకొట్టారు. రోడ్డుప్రమాదంగా చిత్రీకరించి కారులో ఆస్పత్రికి తరలిస్తున్నట్లు నాటకమాడి మార్గమధ్యలో గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి రోడ్డుప్రమాదం జరిగిందని అందరిని నమ్మించారు.
అయితే ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే పోస్టుమార్టం రిపోర్టులో సురేష్ గొంతు నులమడంతో ఊపిరాడక చనిపోయాడని తెలిపింది. దీంతో లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు సురేష్ది హత్యగా నిర్ధారించారు. బబిత, ప్రేమ్సింగ్ సహా ఐదుగురిని మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డి, సీఐ ప్రవీణ్రెడ్డి మీడియాకు వెల్లడించారు.