వినేవాడు ఉంటే చెప్పేవాడికి లోకువ అంటారు.. నిజమే మోసపోయే వారు ఉంటే మోసగాళ్ళకు ఎప్పుడూ పండగే అన్నట్టుంది ఈ మద్య కొన్ని సంఘటనలు చూస్తుంటే. కొన్ని మారుమూల గ్రామాల్లో తెలిసీ తెలియక మోసపోయేవాళ్లు ఉంటారు.. అక్షర జ్ఞానం లేని వారు కొంత మంది అతి తెలివి వాళ్ల చేతుల్లో మోసపోతుంటారు. కానీ ఈ మద్య కొంత మంది చదువుకున్న వాళ్లు సైతం దారుణంగా మోసపోతున్నారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు మోసాలు చేసేది మొత్తం చదువుకున్నవాళ్లనే కావడం విశేషం. డబ్బు ఆశ చూపించి ఎంతో మంది చదువుకున్నవాళ్లను, ఉద్యోగస్తులను సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. ఈ మద్య సరదా కోసం చేస్తున్న పనులు చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా బంధువులు, స్నేహితులు ఇలా సరద సరదా పనులు అంటూనే అతి ప్రమాదాలకు కొని తెచ్చుకుంటున్నారు.
తాజాగా ఉత్తరప్రదేశ్లోనూ ఒకటి జరిగింది. పాపం గంజాయి, మెంతి కూరకు తేడా తెలియక బావ ఇచ్చాడు కదా అని అది వండుకొని తిని ఇప్పుడు ఆస్పత్రిపాలయ్యారు. అయితే ఆ బావ మాత్రం తాను సరదాగా చేశానని.. ఇది ఇంత ప్రమాదం అవుతుందని భావించలేదని లబో దిబో అంటున్నాడు. ఆట పట్టించాలని చేసిన పని కాస్తా వాళ్ల ప్రాణాల మీదకు తేవడంతో అతడు కటకటాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. బాధితులందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
కన్నౌజ్ జిల్లా మియాగంజ్ గ్రామానికి చెందిన ఓం ప్రకాష్ గంజాయిని మెంతిగా చెప్పి తన బావ మరిదికి సరదాగా ఇచ్చాడు. దాన్ని కాస్త వండుకొని తిన్నారు ఆ కుటుంబ సభ్యులు. తర్వాత ఒక్కొక్కరుగా స్పృహతప్పి పడిపోడిపోవడంతో స్థానికులు విషయం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గంజాయిని అంటగట్టిన ఓం ప్రకాశ్ను అరెస్టు చేశారు. సరదాగా కావాలనే చేశాడా లేక మరేదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.