ఏపీ వైద్యరంగంలో ఓ కీలక ఘట్టానికి విజయవాడ సాక్షీభూతంగా నిలిచింది. ఒకే రోజు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 108,104 అంబులెన్సు సర్వీసులు దాదాపు 1100 బారులు తీరిపోతూ ఉంటే.. చూసేందుకు కనువిందుగా ఉంది. రోడ్డుప్రమాదాల వంటి అత్యవసర సమయాల్లో ఇవి ఆపద్భాంధవుతాయి. అందుకే ఈ సేవలను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
సోషల్ మీడియాలో జగన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అనేక రంగాలకు చెందిన సెలబ్రెటీలు శబాష్ జగన్.. అంటూ మెచ్చుకుంటున్నారు. వెయ్యికి పైగా అత్యాధునిక సదుపాయాలు కలిగిన అంబులెన్స్ లను అందుబాటులోకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు.
టాలీవుడ్ ప్రముఖులు కూడా జగన్ ప్రయత్నాన్ని అభినందించారు. దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచమంతా కరోనా సంక్షోభంతో పోరాడుతున్న సమయంలోనూ ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న తీరు అభినందనీయమన్నారు. ప్రజలకు ఎంతో అత్యవసరమైన అంబులెన్సు సర్వీసులను ఒకేరోజు 1,008 వాహనాలను ప్రారంభించడం పట్ల సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. జగన్ను కొనియాడుతూ పోస్టు పెట్టారు.
సినీరంగానికి చెందిన వారే కాకుండా ఇతర రంగాలవారూ మెచ్చుకుంటున్నారు. ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ జగన్ ను ఇంత మంచి చేసినందుకు అభినందించారు. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకున్నారు.