గత కొద్దిరోజులుగా హైదరాబాద్లో లాక్ డౌన్ విదించడంపై జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ మేరకు వైద్యాదికారులు నివేదిక ఇచ్చారని, ఇక అమలు ఒక్కటే పెండింగ్ అనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నగరంలో మరోసారి లాక్డౌన్ విధిస్తారనే వార్తల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన హైదరాబాదీలు తిరుగు ప్రయాణమవుతున్నారు. దీంతో ఆంధ్ర-తెలంగాణ సరిహద్దుల్లోని చెక్పోస్టుల వద్ద గురువారం వాహనాల రద్దీ భారీగా పెరిగింది. ఈ తరుణంలో కీలకమైన ప్రతిపాదన ఒకటి తెరమీదకు వచ్చింది. హైదరాబాద్లో ఒక వేళ మళ్లీ లాక్ డౌన్ పెడితే నిత్యవసరాల్లాగే తమకూ పర్మిషన్ ఇవ్వాలని లిక్కర్ అండ్ బీర్ సప్లయర్స్ అసోసియేషన్, వైన్ షాప్స్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్లో లాక్డౌన్ విధిస్తారని తెలుస్తోందని, అలా జరిగితే నిత్యావసర వస్తువుల దుకాణాల మాదిరిగానే వైన్స్ షాపులకు కూడా రోజూ మూడు గంటలు పాటు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్లో సుమారు నెలన్నరకుపైగా వైన్ షాపులు క్లోజ్ చేశామని, అయినప్పటికీ ఆ సమయంలో ప్రభుత్వం లైసెన్స్ ఫీజును ఏమాత్రం తగ్గించలేదని వైన్ షాప్స్ యజమానులు వాపోయారు.
కరోనాతో ఇప్పటికే సేల్ పడిపోయిందని, బీర్ల అమ్మకాలు సరిగలేవని చెప్పారు. లిక్కర్ అమ్మకాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని, దీనిని దృష్టిలో ఉంచుకుని, రోజుకు కనీసం మూడు గంటల పాటు అమ్మకాలకు టైమ్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అమ్మకాలు చేస్తామని చెప్పారు. ఒకవేళ అనుమతి ఇవ్వకుంటే తాము తీవ్రంగా నష్టపోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలాఉండగా, హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు సొంత ప్రాంతాలకు వెళ్తుండటంతో దాచేపల్లి మండలం పొందుగల చెక్పోస్ట్, పంతంగి, కొరపహాడ్ టోల్ప్లాజా, హైదరాబాద్-వరంగల్ హైవేపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.రామాపురం చెక్పోస్ట్ వద్ద వాహనాలు క్యూ కట్టాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి జీఎమ్మార్ టోల్ప్లాజా వద్ద విజయవాడ వెళ్లే వైపు వాహనాలు బారులుతీరుతున్నాయి. రిజిస్ట్రేషన్, పాసులు లేని వాహనాలను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. తెలంగాణ రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని ప్రతి ఒక్కరిని తనిఖీలు చేస్తూ హోంక్వారంటైన్ స్టాంప్ వేస్తుంది. 14 రోజుల వరకు క్వారంటైన్లో ఉండాలని సూచిస్తున్నారు