జగన్ కేబినెట్లో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో ఇసుక సహా.. మైనింగ్, ఎర్రచందనం అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు పెరిగిపోయాయి. ప్రధాన ప్రతిపక్షం సహా.. దీనిని సపోర్టు చేసే ఓ వర్గం మీడియా జగన్ సర్కారుపై దుమ్మెత్తి పోస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ది రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్లపై నిఘా పటిష్టం చేయాలని, పీడీ యాక్టులు కూలీలపై కాకుండా అందుకు మూలమైన యజమానులపై పెట్టినప్పుడే 90 శాతం స్మగ్లింగ్ ఆపగలమని రామచంద్రారెడ్డి అన్నారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ విషయంలో ప్రజాప్రతినిధులకు సంబంధించి ఎంతటివారైనా వదిలిపెట్టవద్దని మంత్రి పేర్కొన్నారు. తన సొంత తమ్ముడైనా, బంధువైనా స్మగ్లింగ్కు పాల్పడితే వదిలిపెట్టవద్ద ని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. టాస్క్ఫోర్స్లో చిన్నపొరబాటు జరిగినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుం దన్నారు. ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితిలోనూ ఏ విషయంలోనూ చెడ్డ పేరు రావడానికి వీల్లేదని గంటా పథం గా వెల్లడించారు. అయితే, ప్రత్యేక టాస్క్ఫోర్స్ 2015లో ఏర్పాటైనా అక్రమ రవాణాను అరికట్టలేకపో తున్నట్టు చెప్పుకొచ్చారు.
గతంలో ఏడాదికి వందకు పైగా కేసులు నమోదవుతుంటే ఇప్పుడు 20 కేసులు కూడా దాటడం లేదన్నారు. అదే సమయంలో చిత్తూరు జిల్లా రాజకీయాలను ప్రస్తావించిన పెద్దిరెడ్డి .. ఎవరూ చట్టాలకు అతీతులు కారని వ్యాఖ్యానించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి.. పేదలకు బియ్యం పంచిన వ్యవహారాన్ని పెద్దది చేసి చూపించాలని ప్రతిపక్షాలు ప్రయత్నించాయన్నారు. అయి తే, నిజంగానే తప్పు చేస్తే.. ఎలాంటి వారినైనా శిక్షించాల్సిందేనన్నారు. మొత్తంగా పెద్దిరెడ్డి వ్యాఖ్యలను పరిశీలించిన వారు ఏదో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, ఇటీవల జగన్ ఆయనతో జరిపిన చర్చలు ఫలించాయని అంటున్నారు.