తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు భజన చేసే నేతలకు ఏ మాత్రం కొదవ లేదనే చెప్పాలి. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆ భజన బృందం....ఓ రేంజ్‌లో భజన చేసి అసలు విషయాలు చంద్రబాబుకు తెలియనివ్వకుండా ఎన్నికల్లో కొంపమునిగేలా చేశారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక కూడా ఆ నేతలు చంద్రబాబు వీరుడు శూరుడు అంటూ పొగుడుతూనే ఉన్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అయితే ఒక అడుగు ముందుకేసి..తాను చంద్రబాబు భక్తుడిని అని, తన గుండె కోస్తే చంద్రబాబు ఉంటారన్నట్లు చాలాసార్లు చెప్పారు.

 

ఇక బుద్దా వెంకన్న చంద్రబాబు మీద ఈగ వాలనివ్వని విధంగా నడుచుకుంటారు. వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శలు చేస్తే వెంటనే మీడియా సమావేశం పెట్టేసి వాళ్ళ మీద ఫైర్ అవుతారు. ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చంద్రబాబుని ఏమన్నా అంటే చాలు..వెంటనే కౌంటర్లు ఇచ్చేస్తారు. అయితే ఈ విధంగా చంద్రబాబు భక్తుడుగా కొనసాగుతున్న బుద్దాకు, సొంత పార్టీ ఎమ్మెల్సీలే చెక్ పెడుతున్నట్లు కనబడుతోంది.

 

ఈ మధ్య అశోక్ బాబు, దీపక్ రెడ్డిలు బాగా హైలైట్ అవుతున్నారు. ప్రతి విషయానికి వీరు మీడియా సమావేశాలు పెట్టి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మూడు రాజధానుల బిల్లుని మండలిలో అడ్డుకోవడంలో వీరే కీలక పాత్ర పోషించారు. ఇక అప్పటి నుంచి వీరు ఏపీ పోలిటికల్ స్క్రీన్‌పై మెరుస్తున్నారు. దాంతో బుద్దా వెంకన్న కాస్త డౌన్ అయినట్లు కనిపిస్తోంది.

 

ఇటీవల మండలిలో గొడవ జరిగినప్పుడు కూడా దీపక్ రెడ్డి, అశోక్ బాబు, బీదా రవిచంద్రాయాదవ్‌ల పేర్లే బయటకొచ్చాయి. కానీ బుద్దా పేరు ఎక్కడా హైలైట్ కాలేదు. అలాగే ఇటీవల మీడియా సమావేశాల్లో కూడా వీరే ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా అశోక్ బాబు, దీపక్ రెడ్డిలు బాగా హడావిడి చేస్తున్నారు. నెక్స్ట్ పార్టీ పరంగా ఏదైనా పెద్ద పదవులు వస్తాయనే ఉద్దేశంతో వీరు దూకుడుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరు చంద్రబాబు భక్తుడు అని చెప్పుకునే బుద్దాకు చెక్ పడేలా చేస్తున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: