కరోనా మహమ్మారి యువతపైన ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఇప్పటి వరకు వృద్ధుల్లోనే ఎక్కువ ముప్పు కనిపించటం వల్ల యువత వైరస్ను తేలికగా తీసుకుంటున్నారని, అలా భావిస్తే ప్రమాదం పొంచి ఉన్నట్లేనని హెచ్చరిస్తున్నారు. కాబట్టి యువత కూడా చాలా జాగ్రత్రగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రపంచమంతటా కల్లోలం రేపుతున్న కొవిడ్ మహమ్మారి ఇటీవల కాలంలో యువతనూ చుట్టుముడుతోంది. దీంతో వైరస్ను తేలిగ్గా తీసుకోవద్దంటూ యువతను ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా ముప్పు వృద్ధుల్లోనే ఎక్కువగా ఉంటుందన్న ప్రచారం బాగా జరగడంతో యువత తమకేమీ కాదన్న భావనతో ఉండటం సరికాదని గట్టిగా చెబుతున్నారు. కచ్చితంగా జాగ్రత్తలు పాటించి తీరాల్సిందేనని ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో యువతలో కొవిడ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వైద్యుల వద్దకు వస్తున్న వ్యాధిగ్రస్థుల్లో వీరి సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా ఆరిజోనా, టెక్సాస్, ఫ్లోరిడా సహా హాట్స్పాట్ రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో గురువారం నాటికి 27.80 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా వీరిలో క్రమేపీ యువత శాతం పెరుగుతోంది. వాణిజ్య కార్యకలాపాల పునరుద్ధరణ; ఇళ్లకే పరిమితం కావాలన్న నిబంధనలు ఎత్తివేయడం; బార్లు, రెస్టారెంట్లు తెరుస్తుండటం; గ్రాడ్యుయేషన్ పార్టీలు; జాగ్రత్తలు పాటించకుండా ఒకేచోట గుమిగూడటం వంటి కారణాల వల్లే అమెరికాలో యువత ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనిపట్ల వైద్యులే ఆందోళన చెందుతున్నారు. యువతలో కేసులు పెరుగుతుంటే వారిద్వారా వ్యాప్తి ఎక్కువవుతుందని.. దీంతో వృద్ధులకు, దుర్బల పరిస్థితుల్లో ఉన్నవారికి మరింత ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఫ్లోరిడాలో యువత కొవిడ్ బారిన పడుతున్న కేసులు అమాంతం పెరిగినట్లు గవర్నర్ తెలిపారు. రాష్ట్రంలో బార్ల వద్ద ఆల్కాహాల్ సేవించడంపై నిషేధం విధించారు. ఫ్లోరిడాలో లక్షా 55 వేలకు పైగా కేసులుండగా.. ఇటీవల సగటున 30-37 ఏళ్ల వయస్కులు ఎక్కువగా కొవిడ్ బారిన పడుతున్నట్లు ఫ్లోరిడా అంతర్జాతీయ విశ్వవిద్యాలయం అంటువ్యాధుల నిపుణులు తెలిపారు. ఇక్కడ వైరస్ వ్యాప్తికి ఎక్కువగా బార్లు కారణమవుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఇళ్లకే పరిమితం కావాలన్న నిబంధనలు ఎత్తివేయడంతో చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని.. తాము ఇక సురక్షిత వాతావరణానికి వచ్చేసినట్లు ఎక్కువమంది భావిస్తున్నారని చెబుతున్నారు.