దేశంలో ఈ మద్య వైద్యుల నిర్లక్ష్యం నిండు ప్రాణాలు బలి అవుతున్నాయి. ఓ వైపు కరోనాతో డాక్టర్లు యుద్దం చేస్తున్నారు.. మరోవైపు కొంత మంది వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వారికి కూడా మచ్చ తెస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కాన్పు కోసం వెళ్లిన కాటికి పోవాల్సి వచ్చింది. బిడ్డ తల బయటకు వచ్చిన తర్వాత మహిళ స్పృహ కోల్పోయిన స్థితిలో కాన్పు కష్టంగా ఉందంటూ పెద్దాస్పత్రికి సిఫారసు చేశారు. అంబులెన్స్ సమకూర్చమంటే లేదని చెప్పారు. దీంతో ఈ-రిక్షాలో మాట్లాడుకుని తీసుకెళ్లేలోపే తల్లీ, పిల్ల ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లాలోని హాపూర్ ఏరియాలో గురువారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది.
హాపూర్కు చెందిన మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబసభ్యులు స్థానికంగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లారు. అక్కడ అక్కడ వైద్యలు సదరు మహిళను లోపలికి తీసుకెళ్లి కాన్పు కోసం ప్రయత్నించారు. బిడ్డ తలను బయటకు తీశారు. కానీ పూర్తి శరీరాన్ని తీయలేకపోయారు. దాంతో ఆ తల్లి స్పృహ కోల్పోయింది. ఇక కాన్పు చేయడం మరీ కష్టం అని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు మహిళ కుటుంబసభ్యులకు సూచించారు. దీంతో కనీసం అంబులెన్స్ సౌకర్యమైనా కల్పించాలని మహిళ కుటుంబసభ్యులు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిబ్బందిని అర్థించారు. వారు అంబులెన్స్ లేదని చెప్పడంతో ఈ-రిక్షా మాట్లాడుకుని మీరట్ ఆస్పత్రికి బయలుదేరారు.
అయితే మార్గమధ్యలోని తల్లీబిడ్డ ఇద్దరూ మరణించడంతో ఇంటికి తీసుకెళ్లారు. దీనిపై కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరిండెంట్ను వివరణ కోరగా.. మా వైపు తప్పేమీ లేదని.. మేం చేసే ప్రయత్నాలు మేం చేశామని.. ఇక అంబులెన్స్ పిలిపిస్తామని చెప్పినా.. వారు ఈ-రిక్షాలో తీసుకు వెళ్లారని అన్నారు. కాగా, మృతురాలి భర్త రహీముద్దీన్ మాత్రం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తన భార్యాబిడ్డలు చనిపోయారని ఆరోపించారు.అంబులెన్స్ ఇవ్వమన్నా లేదన్నారని, దాంతో ఈ-రిక్షా మాట్లాడుకుని వెళ్లేలోపు ఘోరం జరిగిందని రహీముద్దీన్ తెలిపారు.