కరోనా మహమ్మారి తెలంగాణ రాజధాని హైదరాబాద్ను ఎంతలా వణికిస్తుందో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిన్నటి వరకు అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వందల్లో కేసులు ఉంటే ఇప్పుడు ఒక్క హైదరాబాద్లోనే రోజుకు వెయ్యి కేసులు నమోదు అయ్యే పరిస్థితి వచ్చేసింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువుగా నమోదు అవుతున్నాయి. ఇక్కడ కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో పాటు ఉద్యోగాలు చేసే పరిస్థితి లేకపోవడం... ఒక వేళ ఉన్నా కూడా ప్రాణానికి ప్రమాదకరంగా మారేలా పరిస్థితులు ఉండడంతో ఏపీ ప్రజలు సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు క్యూ కడుతున్నారు.
ఎవరికి వారు పాస్లకు అప్లై చేసుకుని మరీ ఏపీకి వెళ్లిపోతున్నారు. ఇక్కడ ఇప్పట్లో ఉద్యోగం చేయడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడుకోవడం అన్న నిర్ణయానికి ఏపీ జనాలు వచ్చేశారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి పనుల కోసం తిరిగి లక్షల్లో వలస కూలీలు హైదరాబాద్కు వస్తుండడంతో కరోనా విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో కేసులు తీవ్రత అధికం అవుతోంది. హైదరాబాద్లో లాక్డౌన్ విధిస్తారన్న వార్తల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్న వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో సరిహద్దుల వద్ద సందడి నెలకొంది.
థర్మల్ స్క్రీనింగ్ చేసి అనంతరం హోం క్వారంటైన్ ముద్ర వేసి వీరిని ఏపీలోకి పంపేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఏపీకి వెళ్లే వారు ఎవరైనా ఉంటే వారిని పంపేస్తున్నారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ నుంచి అధికారికంగా ఏపీకి వస్తోన్న వారి సంఖ్య వెయ్యికి పైగానే ఉంటోంది. ఈ నెల 1న 1,130 మంది ఏపీలోకి ప్రవేశించినట్టు అధికారులు తెలిపారు. అలాగే, 15 రోజుల క్రితం రోజుకు సగటున 300 వాహనాలు ఏపీలోకి రాగా, ఇప్పుడు వాటి సంఖ్య రెట్టింపు అయింది.