ప్రపంచంలో మనల్ని కన్న తల్లిదండ్రుల తర్వాత అంత నమ్మకంగా ఉండేవి మనం సాదుకునే కుక్కలు. చిన్ననాటి నుంచి కుక్కలని మనం ఏంత అభిమానంగా చూసుకుంటామో.. అంతన్నకన్నా వంద రెట్లు విశ్వాసం మన పట్ల చూపిస్తుంటాయి. కొన్ని కుక్కలు తమ యజమాని చనిపోతే వారి సమాధుల వద్ద పడిగాపులు కాస్తుంటాయి.. తమ యజమాని మళ్లి వస్తారేమో అని. తాజాగా తనని చిన్ననాటి నుంచి ఎంతో ప్రేమతో సాదుకున్న యజమాని మరణం తట్టుకోలేక ఓ కుక్క ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
డాక్టర్ అనితా రాజ్ సింగ్ కాన్పూర్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. మాలిక్ పురంలో నివసిస్తున్న అనితా సింగ్ కు.. తాను పని చేస్తున్న ఆస్పత్రి పక్కన గాయాలతో పడి ఉన్న కుక్క పిల్లను 12 ఏళ్ల క్రితం చేరదీసింది. ఆనాటి నుంచి తన సొంత బిడ్డలా ఆ కుక్కని సాకింది అనితా సింగ్. డాక్టర్ అనితా రాజ్ సింగ్ బుధవారం కన్నుమూసింది. అయితే తన యజమని ఎంతకు స్పందించడం లేదని ఆ కుక్క దిగాలుపడింది. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చారు.
ఇక ఆ కుక్క తన యజమాని మృతదేహాన్ని చూసి రోదిస్తూ కన్నీరు పెట్టుకుంది. మరి దాని మనసులో ఏం అనిపించిందో కానీ.. రెండో అంతస్తు పైకెళ్లి కిందకు దూకింది. అనిత మరణాన్ని తట్టుకోలేక ఆ శునకం అలా చేసి ఉంటుందని కుటుంబ సభ్యులు చెప్పారు. అనిత మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం.. తమ ఇంటి సమీంపలో కుక్క కళేబరాన్ని పూడ్చిపెట్టారు.