కరోనా దెబ్బతో వర్క్​ ఫ్రం హోమ్​ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వర్చువల్​ మీటింగ్​లకే సంస్థలన్నీ మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో వీడియో కాలింగ్​ యాప్​లకు డిమాండ్​ ఎక్కువైంది. ముఖ్యంగా యూజర్లను ఆకట్టుకునేందుకు జూమ్​, గూగుల్​, మైక్రోసాఫ్ట్ సంస్థల మధ్య పోటీ పెరిగింది. అందుకే వినియోగదారులను మరింతగా ఆకర్షించేందుకు మైక్రోసాఫ్ట్​ మెరుగైన ఫీచర్​తో వస్తోంది. దాని విశేషాలివే..

 

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ల హవా నడుస్తోంది. విపరీతంగా వినియోగదారులు పెరగడం వల్ల జూమ్​, గూగుల్​, మైక్రోసాఫ్ట్​ వంటి ఎన్నో సంస్థలు యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇప్పటికే దూసుకెళ్తోన్న 'మైక్రోసాఫ్ట్‌ టీమ్స్'ను మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది మైక్రోసాఫ్ట్​. ఇందులో భాగంగా ఒకేసారి 300 మంది వీడియో కాల్ ద్వారా కనెక్ట్​ అయ్యే సదుపాయాన్ని తెస్తున్నట్లు ప్రకటించింది.

 

సాధారణంగా వీడియో కాలింగ్​ యాప్​లలో పదుల సంఖ్యలోనే యూజర్లు కనెక్ట్​ అయ్యేందుకు అవకాశం​ ఉంటుంది. అయితే పెద్ద కళాశాల, సంస్థలను తీసుకుంటే ఎక్కువ మంది విద్యార్థులు, సిబ్బందిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటివరకు ఉన్న 250 మంది పరిమితిని మరో 20 శాతం పెంచింది. ఫలితంగా 300 మంది ఒకోసారి మాట్లాడే వర్చువల్​ మీటింగ్​లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది​. వెబినార్లు, సాధారణ చిట్​చాట్​​, మీటింగ్​లకు ఇది బాగా ఉపయోగపడనుంది. ఈ విషయాన్ని సంస్థ మేనేజర్​ మైక్​ థాల్ఫ్సన్​ ప్రకటించారు. జూమ్​, గూగుల్​ మీట్​​లో ప్రస్తుతం 100 మంది వరకే ఏకకాలంలో కనెక్ట్​ అయ్యే వెసులుబాటు ఉంది.

 

ప్రస్తుతం 250 లిమిట్​తోనే ఈ యాప్​ పనిచేస్తోంది. ఈ కొత్త ఫీచర్​కు ప్రభుత్వం అనుమతి ఇస్తే దాన్ని 300 పెంచుతామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇది ఎప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందో వివరాలు ప్రకటించలేదు. ఒక స్క్రీన్​లో ఒకేసారి 49 మంది కనిపించేలాగా ఈ యాప్​ను అభివృద్ధి చేస్తున్నారు. మిగతావారు స్లైడ్​ చేస్తే కనిపిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: