వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహారం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. రఘురామకృష్ణంరాజు వ్యవహారంతోనే పార్టీలో తిరుగుబాటుకు బీజం పడిందని వైసీపీ భావిస్తోంది. ఈ తిరుగుబాటుకు సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అదే సమయంలో ధీటుగా ఎదుర్కునేందుకు నరసాపురం ఎంపీ సిద్ధమయ్యారు. ఈ తరుణంలో ఆయనకు హైకోర్టులో న్యాయం జరగడం అనే చాన్స్ తక్కువేనని అంటున్నారు.
తనకు తిరుగులేదన్న తీరుతో ముందుకు సాగుతున్న జగన్ పార్టీలో నిరంకుశంగా ఉంటున్నారని, ఎంపీలు, ఎమ్మెల్యేలకు పార్టీలో స్వేఛ్చలేదని, సీఎం జగన్ను కలవడానికి అపాయంట్మెంట్ దొరకదన్న ఆరోపణలు చే వాటిని చేసింది కూడా రఘురామకృష్ణంరాజే. సీఎంను కలిసేందుకు తాను చేసిన ప్రయత్నాలు ఫలించలేదని రఘురామకృష్ణంరాజు పదే పదే ఆరోపించారు. ఆయన వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న వైసీపీ...ఎంపీపై ఆ పార్టీ ఎంపీలు అనర్హత పిటిషన్ను లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు అందించింది. ఇదే సమయంలో రఘురామ కృష్ణంరాజు అనూహ్య నిర్ణయం తీసుకుని హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలను అడ్డుకోవాలని ఆయన హైకోర్టును కోరారు. తనకేం కాదని, తన ఎంపీ పదవికి వచ్చిన ముప్పేమీ లేదని అంటున్నారు. ప్రభుత్వ పథకాల్లో లోటుపాట్లనే ఎత్తి చూపాను తప్ప అసలు తాను, తమ సీఎం జగన్ను, వైసీపీని ఎక్కడా పల్లెత్తి మాట్లాడలేదని.. ఎంపీ అంటున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి తేడా ఉందని ఆయన అంటున్నారు. నాలుగు నెలలైనా, ఆరు మాసాలైనా ఎలాంటి అస్త్రం తనపై పనిచేయదనే ధీమా తో ఉన్నారు.
అయితే, రఘురామకృష్ణంరాజు అనుకున్నంత సులభంగా ఆయన వైపు పరిస్థితులు ఉండవంటున్నారు. ఇప్పటికే పక్కా ఆధారాలతో వైసీపీ ఎంపీపై ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర పెద్దల నిర్ణయం కీలకం. ఒకవేళ అక్కడ రఘురామకృష్ణంరాజుకు షాక్ తగిలితే...హైకోర్టులోనూ అనుకూల తీర్పు రాకుంటే...సుప్రీంకోర్టు గుమ్మం తొక్కాల్సి వస్తుందంటున్నారు.