ఇప్పుడు అందరి చూపు... కరోనా వైరస్ నియంత్రణ కోసం వచ్చే వ్యాక్సిన్ గురించే. ఈ వ్యాక్సిన్కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. మనదేశంలోని పలు సంస్థలు సైతం ఇందులో నిమగ్నం అయ్యాయి. ఇందులో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ ఒకటి. కరోనా వైరస్ నియంత్రణ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన ఈ సంస్థ ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ చేసింది. వచ్చే నెలలోనే ఆదేశాలు రానున్నట్లు తెలుస్తోంది.
కరోనా వైరస్పై ఇండియా అభివృద్ధి చేస్తున్న తొలి వ్యాక్సిన్ భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసి కోవాక్సిన్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ భారత్ బయోటెక్ సంస్థ నిర్వహిస్తున్నది. భారత ప్రభుత్వం కూడా ఈ వ్యాక్సిన్ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇదిలాఉండగా, ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్.. భారత్ బయోటెక్ సంస్థకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేయాలని ఐసీఎంఆర్ మొత్తం 12 ఫార్మా సంస్థలను కోరినట్లు తెలుస్తోంది. అయితే ట్రయల్స్ను యుద్ధ ప్రాతిపదికన చేయాలని ఐసీఎంఆర్ డైరక్టర్ డాక్టర్ భార్గవ .. జూలై 7వ తేదీన భారత్ బయోటెక్ సంస్థకు లేఖ రాశారు. క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత్ బయోటెక్ సంస్థను ఐసీఎంఆర్ కోరినట్లు తెలుస్తోంది. ఆ ఫలితాల ఆధారంగా ఆగస్టు 15 కల్లా కరోనా వ్యాక్సిన్ను లాంచ్ చేయాలని పేర్కొన్నట్లు సమాచారం. అయితే, ఇది కేవలం ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం మాత్రమే రాసిన లేఖ అని ఐసీఎంఆర్ వర్గాలు చెప్తున్నాయి.
కాగా, ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ఇన్స్టిట్యూట్, బీబీఐఎల్లు సంయుక్తంగా కరోనా వ్యాక్సిన్ తయారీపై పనిచేస్తున్నాయి. సార్స్ సీవోవీ-2 వైరస్ జన్యువు ఆధారంగా వ్యాక్సిన్ను తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐసీఎంఆర్ అధికారులు వివిధ సంస్థలతో లేఖపై తమ అభిప్రాయాల్ని వెల్లడించారు.