దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా పేరు వినిపిస్తుంది. మనిషి జీవనశైలి ఒక్కసారిగా మార్చింది ఈ మాయదారి కరోనా. మన దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. దేశంలో ఎక్కుగా మహరాష్ట్ర అందులోనూ ముంబాయిలోనే కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇది చాలదని ఇక్కడ మిడతల గోల.. తుఫాన్ల తాకిడి ఇలా ముంబాయిని అతలాకుతలం చేస్తుంది. దేశ వాణిజ్య రాజధానిగా చెప్పుకునే ముంబాయి పరిస్థితి దారుణంగా తయారైంది. తాజాగా ముంబాయికి ఇప్పుడు మరో ఉపద్రవం ముంచుకు వస్తుంది. ముంబైలో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నిన్నఉదయం కురిసిన వర్షానికి దాదర్, మాతుంగా, వర్లినాకా, లాల్బాగ్, కింగ్స్ సర్కిల్, సియోన్, కుర్లా, అంధేరీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో జనజీవనం స్తంభించింది. దాంతో ముంబై, రత్నగిరి, రాయ్గఢ్, పాల్గఢ్, థానేలలో నేడు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
మరోవైపు, పలు ప్రాంతాలో చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై కూలడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో స్పందించిన ప్రభుత్వం అత్యవసర సేవల సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఇలా వరుసగా ముంబాయికి వస్తున్న ఉపద్రవాలతో అక్కడి ప్రజల తల్లడిల్లిపోతున్నారు. కాగా, నిన్న ఏకధాటిగా మూడు గంటలపాటు కురిసిన వర్షానికి 157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.