ఈ మద్య లాక్డౌన్ ఫండ్ పేరుతో సైబర్ నేరగాళ్లు వల విసిరి.. అమాయకుల ఖాతాలను ఖాళీ చేస్తున్నారని సైబర్ క్రైం పోలీసులు తెలుపుతున్న విషయం తెలిసిందే. అయినా కూడా కొంత మంది ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతూనే ఉన్నారు. ఈ మద్య లాక్ డౌన్ సమయంలో సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోయారు. తాజాగా ఆన్లైన్లో ఆర్డరు చేసిన నైటీ రాకపోవడంతో చెల్లించిన సొమ్మును పొందే యత్నంలో ఓ మహిళ రూ.60 వేలను మోసపోయిన ఘటన పెరంబూర్ నగరంలో చోటు చేసుకుంది. కొరట్టూరుకు చెందిన మహిళ కొద్ది రోజుల క్రితం ఒక ఆన్లైన్లో నైటీకి ఆర్డరిచ్చింది.
తన భర్త ఏటీఎం కార్డు దారా రూ.550ను ఆమె ఆన్లైన్ ద్వారా చెల్లించింది. ఆ పార్శిల్ అనుకున్న సమయానికి రాకపోవడంతో ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంది. ఆర్డర్ను కాన్సిల్ చేసి నగదును తిరిగి అందించాలని కస్టమ్ కేర్ అధికారి సదరు మహిళ కోరింది. నగదు చెల్లించాలంటే బ్యాంక్ ఖాతా నెంబరును తెలియజేయాలని పేర్కొన్న అధికారి, తొలుత సెల్ఫోన్లో ‘టీమ్ వ్యూవర్’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు.
అనంతరం ఏటీఎం కార్డు రెండు వైపులా ఫొటోలు, టీమ్ వ్యూవర్ ద్వారా కార్డు సమాచారాన్ని పొందిన సదరు అధికారి, మీ సెల్ఫోన్కు వచ్చిన ఓటీపీ నెంబరు చెప్పాలని కోరగా, ఆ మహిళ చెప్పింది. క్షణాల్లో తన భర్త ఖాతా నుంచి రూ.60 వేలు డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. డౌట్ తో మరోసారి మళ్లీ కస్టమర్ కేర్కు సంప్రదించగా, వేరే అధికారి కూడా అవే వివరాలను అడగడంతో.. వెంటనే ఫోన్ పెట్టేసింది. వెంటనే కొరట్టూర్ పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేయగా, ఆన్లైన్ మోసం కావడంతో నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని సైబర్ క్రైం కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.