కరోనా ఎఫెక్ట్ తో హైదరాబాద్ లో ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు ఎలా ఉంటాయి ? గతంలో లాగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయి ? శోభ యాత్ర భారీగా జరుగుతుందా ? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఒక్క భక్తుడులో మెదులుతున్నాయ్.
కరోనా..! ఈ పేరు వింటనే ప్రపంచం హడలిపోతోంది. ఈ మహమ్మారి అన్ని రంగాలపై తన ప్రభావం చూపింది. ఇప్పుడు ఈ వైరస్ కన్ను ప్రతిష్టాత్మక గణేష్ ఉత్సవాలపై పడింది. దేశంలో అత్యంత వైభవంగా గణేష్ ఉత్సవాలు హైదరాబాద్ మహానగరంలో ప్రతి ఏటా జరుగుతాయ్. గ్రేటర్ హైదరాబాద్లో సుమారు ప్రతి ఏడాది లక్షన్నర వరకు గణనాథుడి విగ్రహాలు మండపాల్లో ఏర్పాటు చేస్తారు. అలాగే, వినాయక శోభ యాత్ర కూడా అత్యంత ఘనంగా జరుగుతోంది. లక్షలాది మంది భక్తులు శోభ యాత్రలో పాల్గొంటారు.
ఇప్పుడు గతంలో లాంటి పరిస్థితి లేదు. కరోనా వైరస్ తో ప్రజల జీవన విధానంలో అనేక మార్పులు వస్తున్నాయ్.దీంతో గణేష్ ఉత్సవాలపై ఈ ఏడాది నీలినీడలు కమ్ముకున్నాయ్. అయితే, భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఎప్పటిలాగే ఏర్పాట్లు చేసుకోవాలని నిర్వాహకులకు సూచిస్తుంది. ఈ ఏడాది కోవిడ్ 19 నిబంధనలకు లోబడి నిర్ణయాలు ఉంటాయని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి స్పష్టం చేసింది.
ఈ ఏడాది ఆగస్టు 22 న గణేష్ చతుర్దశి ఉంది.అప్పటికి ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని భాగ్యనగరంలో శోభ యాత్రపై నిర్ణయం తీసుకుంటామని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి స్పష్టం చేసింది .
మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్లో గణేష్ ఉత్సవాల నిర్వహణపై కరోనా తీవ్రతపై ఆధారపడి ఉంది. పండుగ సమయానికి కరోనా కేసులు కంట్రోల్ అయితే గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగే అవకాశం ఉంది. లేకపోతే.. కరోనా ఆంక్షలతో ఈ ఏడాది గణనాధుడి ఉత్సవాలు జరుగుతాయ్.