ప్రపంచంలో చైనా లోని పుహాన్ లో పుట్టుకొచ్చిన కోవిడ్ 19... ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి మరింత పెరిగిపోతోంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1,08,03,599 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 5,18,968కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 43,45,614 మంది చికిత్స పొందుతున్నారు. ఇక భారత్లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 6,48,315కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 18,655కి పెరిగింది. 2,35,433 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,94,227 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, బిహార్, తెలుగు రాష్ట్రాలు బాగా ఉంది. ఇక దేశరాజధాని ఢిల్లీకి 2020 శాపంగా మారిందనే చెబుతున్నారు.
ఢిల్లీలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తుంది. ఇది చాలదని గత కొన్ని రోజులుగా వరుస భూకంపాలతో ప్రజల్లో భయం పట్టుకుంది. ఇప్పటికే పాత భవనాలు నేలమట్టమయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇది చాలదని ఇప్పుడు వరుణ దేవుడు కూడా కక్ష్య కట్టినట్టే ఉందని అనిపిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
ఢిల్లీ నగరంతోపాటు, ఎన్సీఆర్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో గంటకు 20 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కొనసాగే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. శనివారం ఒక్క రోజే కొత్తగా 2,505 పాజిటివ్ కేసులు నమోదు అవడంతో.. ఆ సంఖ్య 97,200కు చేరింది. తాజాగా 55 మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటి వరకు కరోనాతో 3004 మంది కన్నుమూశారు. కరోనా నుంచి 68,256 మంది కోలుకోగా, 25,940 కేసులు యాక్టివ్ లో ఉన్నాయి.