కరోనా మానవ జీవితాలను అతలాకుతలం చేస్తోంది. మనిషులను బతికి ఉన్నప్పుడే అంటరాని వాళ్లను చేస్తోంది. హైదరాబాద్ లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కరోనా పాజిటివ్ వచ్చిన ఇల్లు ఉంటే చాలు.. దాని చుట్టూ కంచెలు వేసి.. సామాజికంగా బహిష్కరణ విధిస్తున్నట్టు చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా తగ్గిపోయినా కొందరు వృద్ధులను ఇంటికి తీసుకెళ్లేందుకు సంబంధీకులు రాని పరిస్థితి నెలకొంది.

 

 

ఇక కరోనాతో చనిపోయిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కరోనా మృతదేహాలకు కనీసం అంత్యక్రియలు కూడా సరిగ్గా జరగడం లేదు. కరోనాకు ముందు ఎవరైనా చనిపోతే.. ధనిక- పేద తేడా లేకుండా ఘనంగా అంత్యక్రియలు నిర్వహించేవాళ్లు.. చివరి చూపు కోసం బంధువులు పోటెత్తేవాళ్లు.. డప్పు మేళాలతో ఘనంగా వీడ్కోలు పలికేవాళ్లు.

 

 

ఇప్పుడు కరోనా మృతదేహాల అంత్యక్రియలు దారుణంగా జరుగుతున్నాయి. కరోనాతో ప్రాణం పోతే మృతదేహాన్ని కనీసం చూసేందుకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులకు కూడా అవకాశం దక్కడం లేదు. హైదరాబాద్‌లో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు కూడా పూర్తిగా జరగడం లేదన్న విషయం వెలుగు చూసింది. మృతదేహాలు పూర్తిగా కాలకుండానే వదిలేస్తుండటంతో శరీర భాగాలను కుక్కలు పీక్కు తింటున్నాయి.

 

 

గాంధీ ఆసుపత్రిలో కరోనాతో చనిపోతే ఈఎస్‌ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికలో దహనం చేస్తున్నారు. అక్కడ అంత్యక్రియల పర్యవేక్షణకు జీహెచ్‌ఎంసీ ముగ్గురు సిబ్బందిని నియమించారు. శనివారం తన తాత అస్థికల కోసం వచ్చిన ఓ వ్యక్తికి అక్కడ సగం కాలిన మృతదేహాలను కుక్కలు పీక్కుతింటుండటం కనిపించింది. ఆయన ఈ దృశ్యాలను తన మొబైల్ ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఈ దారుణం వెలుగు చూసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: