ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వారాలుగా కరోనా కేసుల పెరుగుదల తీవ్రతరం అవుతోంది. ఇక్కడ కరోనా కేసులు రోజుకు వెయ్యికి చేరుకునేందుకు అతి సమీపంలో ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడ కరోనా పరీక్షలు దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఏకంగా 10 లక్షలకు చేరుకున్నాయి. ఇక రాష్ట్రంలో నమోదు అయిన కరోనా కేసులను మొత్తం చూస్తే 18 వేలకు చేరుకున్నాయి. అయితే ఇక్కడ తెలంగాణతో పోలిస్తే కరోనా వ్యాప్తి రేటు, మరణాల రేటు చాలా తక్కువుగా ఉండడం కాస్త ఆనందించాల్సిన విషయం. ఇదిలా ఉంటే ఇక్కడ కరోనా గురించి కొన్ని భయంకర నిజాలు వెల్లడవుతున్నాయి.
కరోనా విషయంలో ఇప్పటి వరకు 60 సంవత్సరాలు వయస్సు పై బడిన వారితో పాటు 10 ఏళ్ల లోపు పిల్లలకు మాత్రమే ఎక్కువుగా వస్తుందని.. ప్రచారం జరిగింది. ప్రపంచంలో ఈ వ్యాధి భారీన పడి చాలా మంది చనిపోయినా వారిలో మధ్య వయస్సు ఉన్న వారి సంఖ్య తక్కువుగా ఉంటూ వస్తోంది. అయితే ఏపీలో మాత్రం ఇందుకు రివర్స్లో జరుగుతోందట. కరోనా ఇక్కడ 16 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులను ఎక్కువుగా కబలిస్తోందట.
ఏపీలో ఈ నెల 3వ తేదీ వరకు ఉన్న కేసులను పరిగణలోకి తీసుకుంటే 62 శాతం కేసులు 16 - 45 ఏళ్ల మధ్యలో ఉన్న వారికే కరోనా వచ్చినట్లే తేలిందట. ఇక 46 నుంచి 60 ఏళ్ల వయసున్న వారు 20 శాతం ఉన్నారని అంటున్నారు. ఇక 15 ఏళ్ల లోపు పిల్లలు పిల్లల్లో కరోనా 7 శాతం వరకు నమోదైందని అంటున్నారు. ఇక కరోనా సోకిన వృద్ధుల్లో మధుమేహం, బీపీ, హృద్రోగాలు ఉండడంతో మరణాలు సంభవిస్తున్నాయని వైద్య నిపుణులు వివరించారు. ఏదేమైనా కరోనా విషయంలో మధ్య వయస్కులు, యువకులు కూడా జాగ్రత్తగా ఉండాలి.