కరోనా మహమ్మారి తెలంగాణతో పాటు గ్రేటర్ హైదరాబాద్ను కమ్మేస్తోంది. తెలంగాణలో పరీక్షలు తక్కువుగా జరుగుతున్నాయని.. పరీక్షల సంఖ్య పెంచితే ఇక్కడ కరోనా లెక్కలు కూడా ఎక్కువ అవుతాయన్న సందేహాలు ఉన్నాయి. ఇదే అంశంపై ప్రతిపక్షాల నుంచి సైతం తీవ్ర విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో వస్తోన్న కరోనా కేసుల్లో కొత్త లక్షణాలు బయట పడుతుండడం ప్రతి ఒక్కరిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
హైదరాబాద్లోని కోవిడ్ 19 ఆస్పత్రులకు వస్తున్న రోగులలో ఇప్పటి వరకు ఉన్న లక్షణాల కంటే కొత్త లక్షణాలు వస్తున్నాయి. వీటిల్లో రియా(విరేచనాలు),వాంతులు,తలనొప్పితో వస్తున్న వారు ఎక్కువుగా ఉంటున్నట్టు పరీక్షల్లో తేలుతోంది. అయితే ఇప్పుడు వాతావరణం మారింది. వర్షాకాలం రావడంతో పాటు హైదరాబాద్లో వర్షాలు కురుస్తుండడంతో పరిస్థితి మారింది. ఈ ప్రభావం కూడా కొంత వరకు ప్రజలపై పడి సాధారణ జ్వరాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు కరోనా రోగుల్లో ఈ లక్షణాలు కూడా ఉండడంతో ఈ లక్షణాలు ఉన్న వారందరికి కూడా కరోనా ఉందా? లేదా ? అన్న విషయం నిర్దారించే క్రమంలో కొంత గందరగోళం అయితే ఉందని అంటున్నారు.
తాజాగా హైదరాబాద్ ఆసుపత్రుల్లో నమోదైన కేసుల్లో 67 కేసులు విరేచనాలు,వాంతులు,తలనొప్పికి సంబంధించినవే. ఇందులో 30 మంది ఆస్పత్రిలో చేరిన కొద్ది గంటలకే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇలా చనిపోతోన్న వారిలో చాలా మందికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు వస్తున్నాయి. చలి, వణుకుతో పాటు కండరాల నొప్పి, గొంతు మంట, రుచి, వాసన కోల్పోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.