కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలను కంటికి కనిపించడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాణాంతక మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు, చిన్నరాజ్యాలు అని తేడా లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మొదట చైనాలో పుట్టుకొచ్చిన ఈ కరోనాకు వ్యాక్సిన్ లేకపోవడంతో.. నివారణపై అందరూ దృష్టి సారించారు. ఈ క్రమంలోనే లాక్డౌన్ విధించడంలో పాటు అనేక కఠన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కరోనా జోరు తగ్గడం లేదు.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11544806కి చేరగా.. మరణాల సంఖ్య 536359కి పెరిగింది. ఇదిలా ఉంటే..కొందరికి కరోనా పాజిటివ్ వచ్చినా లక్షణాలు మాత్రం కనిపించడం లేదు. ఈ క్రమంలోనే లక్షణాలు లేకపోతే ఏదో జరిగిపోతుందనే భయం కొందర్ని వెంటాడుతోంది. మరియు లక్షణాలు లేకుండానే కరోనా అని తెలిస్తే చాలా మంది డీలా పడిపోతున్నారు. అయితే వాస్తవానికి కరోనా సోకినా.. లక్షణాలు లేనివాళ్లు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.
ఎందుకంటే.. కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నందువల్లే లక్షణాలు కనిపించవని.. వైరస్ ప్రభావం చూపలేకపోయిందని అర్థం అంటున్నారు పరిశోధకలు. అంతేకాదు, ఇలాంటి వారు ఇంట్లో ఉండి వైద్యం చేసుకుంటే సరిపోతుందని.. శ్వాసకోశ సమస్య ఉంటే తప్ప అలాంటివారికి ఆస్పత్రి వైద్యం అవసరం లేదంటున్నారు నిపుణులు. మరియు మిగతా వారితో పోలిస్తే వీరికి త్వరగా కోలుకునే అవకాశాలు కూడా ఎక్కవని చెప్పారు.
అయితే లక్షణాలు లేకున్నా.. ఇలాంటి వారి నుంచి కూడా వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది. కానీ, వైరస్ సోకిన పది రోజుల్లోపే అలాంటి వారి నుంచి వైరస్ ఇతరులకు సోకుతుందంటున్నారు. ఆ తర్వాత అది బలహీన పడిపోతుందని పేర్కొన్నారు. కాబట్టి.. కరోనా పాజిటివ్ అని తేలినా వైరస్ లక్షణాలు కనిపించడం లేదంటూ.. ఎలాంటి చింతా పడకుండా ధైర్యంగా కరోనాను ఎదుర్కొండి. అప్పుడే కరోనాను జయిస్తారు.