ఇది కరోనా సమయం.. ఆ మహహ్మారి దారుణంగా వ్యాపిస్తోంది. కరోనా రోగితో ఏమాత్రం సంబంధం ఉన్నా.. ఇట్టే వారికీ ఈ రోగం సోకుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎక్కడో ఒకచోట లోపం జరగడం.. వారి నుంచి కరోనా వ్యాపించడం చూస్తూనే ఉన్నాం. అందుకే ఏమాత్రం కరోనా లక్షణాలు కనిపించినా జనం పరీక్షల కోసం పరుగెత్తుతున్నారు.
అసలే ఇది వర్షాకాలం.. ఈకాలంలో సీజనల్ వ్యాధులు సర్వసాధారణం. జలుబు, తుమ్ములు, దగ్గు, జ్వరం సాధారణంగానే వస్తుంటాయి. కానీ కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ ఇది కరోనా వల్ల వచ్చిందేమో అని భయపడుతూ పరీక్షల కోసం వెళ్తున్నారు. పోనీ.. పరీక్షల్లో ఏమైనా పక్కాగా ఫలితాలు వస్తున్నాయా అంటే అదీ లేదు. ఈ రోజు కరోనా నెగిటివ్ చూపిస్తే.. మళ్లీ రేపే పాజిటివ్ చూపుస్తోంది. ఈ రోజు పాజిటివ్ చూపిస్తే మరుసటి రోజే నెగిటివ్ చూపిస్తోంది.
అయితే ఇందుకు కారణాలు లేకపోలేదు.. కరోనా పరీక్షల విషయంలో.. బాధితుని నమూనాల స్వీకరించడం చాలా ముఖ్యమైన అంశం. శాంపిల్ తీసేటప్పుడు గొంతు లోపలికి వెళ్లి తీయాలి.. అలా కాకుండా పైపైనే శాంపిల్ తీస్తే గొంతులో వైరస్ ఉన్నా నెగెటివ్ ఫలితం రావడానికి ఛాన్స్ ఉంది. అందుకే.. మళ్లీ సరిగ్గా శాంపిల్ తీసినప్పుడు పాజిటివ్ వస్తోంది.
అలాగే.. వైరస్ సోకిన 4-7 రోజుల్లో ఒంట్లో వైరస్ తీవ్రత పెరుగుతుంది. అప్పటి వరకూ వైరస్ సాధారణంగానే ఉండొచ్చు. ఈ సమయంలో శాంపుల్ సేకరించినా.. ఫలితం నెగెటివ్ వస్తుంటుంది. మూడు నాలుగు రోజుల తర్వాత శాంపిల్ తీస్తే.. తీవ్రత పెరిగి పాజిటివ్ వస్తుంది. అలాగే... ఎలాంటి లక్షణాలు లేకున్నా వైరస్ ఒంట్లోకి ప్రవేశించిన 10-12 రోజుల్లో శాంపిల్ ఇస్తే పాజిటివ్గా వస్తుంది. లక్షణాలు లేవు కాబట్టి మరో రెండు రోజుల వ్యవధిలో మరోసారి శాంపిల్ ఇస్తే.. తీవ్రత తగ్గి నెగెటివ్గా వస్తుంది. అందుకే ఫలితాల గురించి బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. అనుమానం వస్తే మరోసారి టెస్ట్ చేయించుకోవాల్సిందే.