ఫుట్బాల్ మైదానాల పరిమాణం..! చైనా నిర్మించిన దానికి పదిరెట్లు..! ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా చికిత్స కేంద్రం..! ఇన్ని ఘనతలు ఉన్న ఆస్పత్రి ఎక్కడో లేదు. దేశ రాజధాని ఢిల్లీలో కొలువైంది.
ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ సెంటర్ ఢిల్లీలో ప్రారంభమైంది. కేంద్రం సహాకారంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ ఆస్పత్రిని నిర్మించింది. దేశ రాజధానిలో కరోనా ఉధృతి కొనసాగుతున్న వేళ ఈ భారీ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టి అనుకున్న సమయంలోనే నిర్మాణాన్ని పూర్తి చేశారు.దీనికి 'సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్"గా నామకరణం చేశారు. ఈ ఆస్పత్రిని కేంద్రమంత్రులు రాజ్నాథ్, అమిత్షా సందర్శించారు.
ఈ ఆస్పత్రి.. చైనాలో నిర్మించిన కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రికి పదింతలు పెద్దది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో దీన్ని ఏర్పాటు చేసింది ఢిల్లీ సర్కార్. దీనిలో మొత్తం నాలుగు విభాగాలు ఉండగా.. ఒక్కొక్క దానిలో 250 పడకలు ఉంటాయి. ఒక విభాగంలో ఆక్సిజన్, ఐసీయూ సౌకర్యాలు ఉంటాయి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ విభాగానికి చెందిన వైద్య సిబ్బంది ఈ ఆసుపత్రిలో పనిచేస్తారు. లక్షణాలు లేని, తేలికపాటి లక్షణాలు గల రోగులకు ఐసోలేషన్ కేంద్రంగా ఆసుపత్రి పనిచేయనుంది. రోగుల్లో ఒత్తిడి తగ్గించేందుకు, వారికి మానసిక స్థైర్యాన్ని అందించేందుకు ఆసుపత్రి ఉపయోగపడనుంది.
1,700 అడుగుల పొడవు, 700 అడుగుల వెడల్పుతో ఆసుపత్రిని సిద్ధం చేశారు. ఈ చికిత్సా కేంద్రం దాదాపు 20 ఫుట్బాల్ మైదానాల పరిమాణంతో ఉంటుంది. ప్రతి గదిలో 50 పడకలతో కేంద్రంలో మొత్తం 200 గదులు ఉన్నాయి. ప్రస్తుతం రెండు వేల పడకల్లో ఉన్న పేషెంట్లకు చికిత్స అందించేందుకు 170 మంది వైద్యులు, 700 మంది నర్సులు అందుబాటులో ఉన్నారు. రోగులు వారి వెంట ల్యాప్ట్యాప్ తెచ్చుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. ప్రతి పడక వద్ద ల్యాప్ట్యాప్, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు.