పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు.. పెళ్లి కార్యక్రమానికి ఎక్కడెక్కడ నుంచి బంధువులు, స్నేహితులు తరలి వస్తుంటారు. వివాహం అనేది జవితంలో ఓ మధుర ఘట్టం. అందరూ సంతోషంగా పెళ్లి కార్యక్రమంలో మునిగిపోయారు. అంతలోనే పెళ్లికూతురు మేకప్ కోసం బ్యూటీపార్లర్కు వెళ్లిన ఓ వధువు అక్కడే దారుణ హత్యకు గురైనట్లు వార్తలు రావడంలో అందరూ షాక్ కి గురయ్యారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లో లో జరిగింది. రాట్లాం జిల్లాలోని జోరా సిటీలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దారుణ హత్య వెనుక ప్రేమ కోణం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. వివరాల్లోకి వెళితే.. షాజాపూర్ చెందిన సోనూ యాదవ్ అనే యువతికి మూడేళ్ల క్రితం ఓ కార్యక్రమంలో రామ్ యాదవ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.
ఆ పరిచయం కాస్తా.. స్నేహంగా మారి ప్రేమ వరకు వెళ్లింది. ఇటీవల కాలంలో వీరి మద్య విభేదాలు తలెత్తడంతో ఇద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో సోనూకు మరొకరితో పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. దీంతో షాజాపూర్ నుంచి సోనూను తీసుకుని జోరా సిటీకి వచ్చారు. వివాహానికి కొన్ని గంటల ముందు పెళ్లికూతురి మేకప్ కోసం సోనూ తన బంధువుతో కలిసి దగ్గర్లోని బ్యూటీ పార్లర్కు వెళ్లింది. సోనూ ని అదేపనిగా వెంటాడుతున్న రామ్ యాదవ్ ఆమె బ్యూటీపార్లర్లో ఉన్నట్లు తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్లి సోనూ గొంతు కోసి చంపేశాడు.
ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత రామ్ యాదవ్..అక్కడ్నుంచి రాజస్థాన్కు పరారయ్యాడు. పెళ్లికూతురు హత్యకు గురైందని తెలిసిన తర్వాత అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు వ్యక్తులను గుర్తించిన పోలీసులు పవన్ను అదుపులోకి తీసుకున్నారు. రామ్ యాదవ్ తన ప్రేమను తిరస్కరించిందన్న పగతోనే ఈ హత్యకు పాల్పడినట్లు అతడు విచారణలో తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రామ్ యాదవ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.