మరోమారు తిరుమల తిరుపతి దేవస్థానం వార్తల్లోకి ఎక్కింది. సప్తగిరి మాస పత్రిక బట్వాడ సందర్బంగా గుంటూరుకు చెందిన ఒక పాఠకుడికి సప్తగిరితో పాటు అన్యమతానికి చెందిన మరో పుస్తకం బట్వాడా అవడం కలకలం రేపుతోంది. గతంలో, ఒకసారి యేసు కీర్తనలు. మరో సారి ఊహ తెలియని తొమ్మిదో తరగతి విద్యార్థి రాసిన అభూత కల్పనలతో ఓ కథనం ముద్రణ అంశం టీటీడీ సప్తగిరిని ఇరకాటంలో పడేసింది. ఇప్పుడు ఏకంగా సప్తగిరి మాసపత్రికతో పాటు క్రైస్తవ మాసపత్రికల బట్వాడా అదే పోస్టులో...అదే కవరులో జరిగిందని అభిమానులు భగ్గుమంటున్నారు. హైందవ ధర్మం పట్ల ఎందుకు ఈ నిర్లక్ష్యం?పథకం ప్రకారం హిందూ ధర్మం పై చేస్తున్న దాడి కాదా? ఇప్పటివరకు టీటీడీ దృష్టికి తీసుకొచ్చిన యే ఒక్క అన్య మత ప్రచార విషయంపైనా దర్యాప్తు లేదు? ఎందుకు? ఇప్పటికైనా హిందూ సమాజం కళ్ళు తెరిచి టీటీడీ నీ, వెంకన్న ఆస్తులను, దేవాదాయ ఆస్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? ఉద్దేశ్యపూర్వకంగా చేసిందేనా తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో టీటీడీ ప్రజలకు వివరణ ఇచ్చింది. రెండు పుస్తకాలు కలిపి బట్వాడ చేయడం తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. టీటీడీ ప్రతిష్టను దెబ్బ తీయడానికి కొంత మంది చేసిన చర్యగా భావించి దీనిపై నిజాలను నిగ్గుతేల్చేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపింది. ``సప్తగిరి మాస పత్రికలను పోస్టల్ శాఖ వారే ప్యాక్ చేసి, బరువు చూసి పాఠకుడి చిరునామాలు అతికించి బట్వాడ చేస్తారు. ఇందుకోసం పోస్టల్ శాఖకు పోస్టేజి చార్జీలతో పాటు ఒక్కో ప్రతికి అదనంగా రూ. 1.05 టిటిడి అదనంగా చెల్లిస్తోంది. పోస్టల్ శాఖ సప్తగిరి మాస పత్రికను బుక్ పోస్టులో పంపుతుంది కనుక ఎలాంటి సీలు ఉండదు. సప్తగిరి మాస పత్రిక ప్యాకింగ్, డెలివరి భాధ్యత మొత్తం పోస్టల్ శాఖవారే చూస్తారు. ఈ విషయంగా పలు జిల్లాలకు చెందిన సప్తగిరి పాఠకులకు ఫోన్ చేసి విచారించగా అలాంటి అన్యమత పుస్తకం తమకు అందలేదని తెలియజేశారు. దీనిని దురుద్యేశ చర్యగా భావిస్తూ టిటిడి తీవ్రంగా పరిగణిస్తోంది తగు చర్యల కోసం ఫిర్యాదు చేసింది`` అని ప్రకటనలో పేర్కొంది.