తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో రెచ్చిపోతోంది. రెండు వేలకు చేరువలో నమోదై దడ పుట్టిస్తోంది. లాక్ డౌన్ సడలింపు చేసినప్పటి నుంచి ఇక విచ్చలవిడిగా బయట తిరగడం మొదలు పెట్టారు జనాలు. అయితే కరోనా వైరస్ క్షణాల్లో విస్తరిస్తూ దాని పని అది చేసుకుంటూ పోతుంది. కరోనా కేసులు హైదరాబాద్లో ఎక్కువగా నమోదవడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా తెలంగాణలో 1,831 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,419 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 25,733కు పెరిగింది.
తెలంగాణలో రికార్డు స్థాయిలో 11 మంది మృతిచెందగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మృతుల సంఖ్య 306కు పెరిగింది. కరోనా చికిత్స పొందుతూ కోలుకుని నేడు 2,078 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 14,781కి చేరింది. ఈ నేపథ్యంలో హోం క్వారంటైన్లో ఉండి కొవిడ్ చికిత్స తీసుకోవాల్సిన కొందరు ఇంట్లో ఉండకుండా ఇష్టానుసారంగా బయట తిరుగుతున్నారని, అలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టి కేసులు నమోదు చేస్తామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు.
ఇక కరోనా లక్షణాలు ఉండి.. తీవ్ర అస్వస్థతకు గురైన వారు మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వ్యాధి లక్షణాలు లేకున్నా కొవిడ్ పాజిటివ్ వచ్చినవారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారిని వైద్యులు హోం క్వారంటైన్లో ఉండాలని సూచిస్తున్నారు. వైద్యులు సూచించినట్లుగా హోం క్వారంటైన్లో ఉండేవారు కచ్చితంగా 14 రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాకూడదు. ఇంట్లో కుటుంబ సభ్యులైనా దూరంగానే ఉండాలి. ఇక నుంచి రాచకొండ పరిధిలో హోం క్వారంటైన్లో ఉన్నవారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తే కేసులు నమోదు చేస్తాం అని సీపీ హెచ్చరించారు.