లాక్డౌన్.. ఈఏడాది ఆరంభం వరకూ ఈ పదం తెలియనివాళ్లు ఇండియాలో కోకొల్లలు. కానీ ఇప్పుడు మారుమూల పల్లెవాసులకు కూడా లాక్ డౌన్ అంటే తెలియకుండా లేదు. కరోనా కారణంగా అలాంటి పరిస్థితి తలెత్తింది. అంతే కాదు.. ఈ లాక్ డౌన్ మనకు అనేక అనుభవాలు నేర్పింది. లాక్ డౌన్ సమయంలో జనం వ్యవహారశైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. లాక్డౌన్ కారణంగా మిగిలిన వ్యాపారాలన్నీ విపరీతంగా దెబ్బ తింటే.. ఆన్ లైన్ షాపింగ్ మాత్రం ఫుల్ జోష్లోకి వెళ్లింది.
అంతకుముందే ఈ జోరు ఉండేది. ఇది కాస్తా లాక్ డౌన్ కారణంగా ఓ రేంజ్కు వెళ్లిపోయింది. జనం ఆన్ లైన్ మార్కెటింగ్ కు బాగా అలవాటు పడిపోయారు. ఆన్లైన్ ద్వారా వస్తున్న పార్శిళ్లలో ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్లు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఆన్లైన్ పాఠాలు, ఉపాధ్యాయుల విద్యా బోధన, ఇంటి నుంచి పని చేసే వారి సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతుండటంతో గాడ్జెట్లకు గిరాకీ పెరిగింది.
అంతేకాదు.. హెడ్ఫోన్స్, ట్యాబులు, మొబైల్ పవర్ బ్యాంకులకు ఆర్డర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఆన్ లైన్ క్లాసుల కారణంగా ట్యాబ్ల కోసం పెద్ద సంఖ్యలో ఆన్లైన్లో వెతుకుతున్నారు. అయితే ఆన్ లైన్ మార్కెటింగ్ చేస్తున్నా.. ఇంటివద్దకే వస్తువులు వస్తున్నా.. జనం మాత్రం కరోనా భయంతో పార్శిళ్లను తాకేందుకు ఇష్టపడడం లేదు.
డెలివరీ బాయ్స్ పార్శిల్ ఇంటి దగ్గర పెట్టాక.. శానిటైజ్ చేసుకున్నాకే ఇంట్లోకి తీసుకెళ్తున్నారు. కరోనా భయంతో నగరాలు, ప్రధాన పట్టణాల్లో చిన్నారుల వస్తువులను కూడా ఆన్ లైన్లోనే కొంటున్నారు. ప్రతి సంక్షోభమూ కొన్ని అవకాశాలను తీసుకొస్తుంది.. ఈ మాటలు ఆన్ లైన్ షాపింగ్ విషయంలో మరోసారి రుజువయ్యాయి.