చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ కొద్ది రోజుల్లోనే ప్రపంచాన్ని చుట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,15,56,641 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వల్ల 5,36,776 మంది చనిపోయారు. ఇప్పటివరకు ఈ వైరస్ భారినపడినవారిలో 65,34,851 మంది కోలుకోగా, మరో 44,85,014 మంది బాధితులు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ కరోనా ప్రభావం ఎక్కువగా అమెరికాలో ఉంది.. ఆ తర్వాత బ్రేజిల్, రష్యా ఇలా పలు దేశాల్లో కరాళ నృత్యం చేసింది. ఇప్పుడు భారత్ లో కూడా కరోనా బీభత్సం సృష్టిస్తుంది. వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. మొన్నటి వరకు నాలుగో స్థానంలో ఉన్న కరోనా కేసులు ఇప్పుడు రష్యాను పక్కకు నెట్టి మూడో స్థానంలోకి వచ్చింది. భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలు దాటింది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 22,252 కేసులు నమోదు అయ్యాయి.
24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 467 మంది మరణించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,665కి చేరుకున్నది. దీంట్లో 2,59,557 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 4,39,948 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 20,160గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మార్చిలో లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత కేసుల సంఖ్య తక్కువగా ఉంది. అప్పట్లో భారత్ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక అన్లాక్ 2.0లో ఆంక్షల సడలింపు కారణంగా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి.
రాష్ట్రాల్లోనూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు తరువాత మరికొన్ని రాష్ట్రాలు కూడా కరోనా హాట్స్పాట్లుగా మారుతున్నాయి. ఒడిశా, పంజాబ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, గోవా తదితర రాష్ట్రాలు కరోనాకు కొత్త హాట్స్పాట్లుగా మారాయి. మొన్నటి వరకు కరోనా కేసులను పంజాబ్, గోవా, జార్ఖండ్ రాష్ట్రాలు నియంత్రించినప్పటికీ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో జూన్ 19- జూలై 2 మధ్య కరోనా పాజిటివ్ కేసుల రేటు ఐదు శాతానికి పైగా పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,39,948 మంది కోలుకున్నారు.