యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలో తాజాగా బుబోనిక్ ప్లేగు కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో ఇటీవల వెలుగు చూసిన కొత్త రకం స్వైన్ ఫ్లూ వైరస్ ప్రపంచాన్ని పరేషాన్ చేస్తోంది. అయితే, దీని గురించి తాజాగా తీపికబురు వినిపించింది. జీ4 గురించి భయపడాల్సింది ఏమీ లేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకింది అనడానికి ఎలాంటి ఆధారాలులేవని చెప్తున్నారు.
చైనాలో పందుల పెంపకందారుల్లో ఈ వైరస్ సోకిన వారికి పరీక్షలు నిర్వహించగా ప్రాణాంతకమైందని వార్తలు వచ్చాయి. అచ్చం కరోనా వైరస్ లాగే, ఇది మరో మహమ్మారి అయ్యే అవకాశం ఉందని వార్తలు రావడం అనేకమందిని షాక్కు గురిచేసింది. ఇలా ప్రచారం జరిగిన నేపథ్యంలో శాస్త్రవేత్తల ప్రకటన కాస్త ఊరటనిస్తున్నది. ఈ వైరస్ను 2011లోనే గుర్తించి, దాని వ్యాప్తిని గమనిస్తునట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా, కరోనా విషయాన్ని దాచిపెట్టిన చైనా.. అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్ని తీవ్ర నష్టానికి గురిచేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకు పడ్డారు. వైరస్ అంశాన్ని రహస్యంగా ఉంచుతూ, తన మోసపూరిత చర్యలను కప్పిపుచ్చుకునేందుకు చైనా ప్రయత్నించడం వల్లే మహమ్మారి 189 దేశాలకు వ్యాపించిందని ఆరోపించారు. ఇందుకు చైనా తప్పక మూల్యం చెల్లిస్తుందన్నారు. అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఆయన మాట్లాడారు. మిగతా దేశాలతో పోలిస్తే, అమెరికాలోనే అత్యధిక, నాణ్యమైన కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. వైరస్ విలయానికి మూల కారణం చైనాయేనని మండిపడ్డారు.
కాగా, చైనాలోని బయన్నూర్లోని దవాఖానలో ఈ కేసు నమోదైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో అధికారులు లెవల్-3 హెచ్చరికలు జారీచేశారు. ఈ ఏడాది చివరి వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అసాధారణ లక్షణాలు కనిపిస్తే వైద్యులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఇలాంటి తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకు వచ్చి పెద్ద ఉపశమనం కలిగించే వార్త చెప్పింది.