వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి.. ఈ పేరు చెప్పగానే అభిమానులు ఆనందంతో పులకించిపోతారు. ఆయన పరమపదించి దశాబ్దం గడిచిపోయినా ఇంకా ఆయన స్మతుల్లో వారు తాద్యాత్మం చెందుతారు. వైఎస్ గురించిన విశేషాలు ఏవైనా వారికి ఆసక్తి దాయకమే. అందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఇప్పటికే ఎందరో పుస్తకాలు రాశారు. అయితే ఇప్పుడు సాక్షాత్తూ ఆయన జీవన సహచరి విజయమ్మ స్వయంగా రాసిన ‘‘నాలో... నాతో... వైయ‌స్సార్‌ ’’ పుస్తకం ఇప్పుడు వైఎస్ జయంతి వేళ.. ఆయన కుమారుడు వైఎస్‌ జగన్ చేతుల మీదుగా ఆవిష్కృతమవుతోంది.   

 


వైయ‌స్సార్‌ ఒక తండ్రిగా, భర్తగా, ఎలా ఉండేవారో ఈ పుస్తకంలో విజయమ్మ ఆవిష్కరించారు. కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా... నిజ జీవితంలో వైఎస్సార్‌ ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండేవారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో... ఉన్నది ఉన్నట్టుగా విజయమ్మ ఈ పుస్తకంలో వివరించారు.

 


డాక్టర్ వైయ‌స్సార్‌ సహధర్మచారిణిగా వైయ‌స్‌ విజయమ్మ 37 ఏళ్ళ జీవితసారం ఈ పుస్తకం. 2009 సెప్టెంబరు 2న అనూహ్యంగా వైయ‌స్సార్‌ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం ఈ పుస్తకం. మహానేత గురించి లోకం ఏమనుకుంటున్నదీ తాను ప్రజల నుంచి తెలుసుకున్నానని...  ఆయన గురించి ప్రజలకు తెలియని కొన్ని విషయాలు తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చానని వైఎస్‌ విజయమ్మ ఈ పుస్తకంలోని తొలి పలుకులో వివరించారు. 

 


వైఎస్ వేసిన ప్రతి అడుగు వెనకా ఉన్న ఆలోచనను, అనుభవాల నుంచి ఆయన నేర్చుకున్న పాఠాలను ఈ పుస్తకంలో విజయమ్మ వివరించారు. ఆయన, ఇంట గెలిచి రచ్చ గెలిచిన తీరును, ఇంట్లోవారి అవసరాలను అర్థం చేసుకున్నట్టే ప్రజలను కూడా కుటుంబ సభ్యులుగా భావించి వారి అవసరాలను కూడా  అర్థం చేసుకున్న విధానాన్ని విజయమ్మ తెలిపారు.  వైఎస్సార్‌ తన జీవితమంతా పెంచి, పంచిన మంచితనమనే సంపద తన పిల్లలూ మనవలకే కాకుండా...ఇంటింటా పెరగాలనే సంకల్పంతోనే ఈ పుస్తకాన్ని సవినయంగా సమాజం ముందుంచుతున్నానని విజయమ్మ పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: