దాడి చేయగల నాలుగు డోన్లను పాకిస్థాన్​కు చైనా అందివ్వనుంది. ఇరు దేశాలకు సంబంధించిన సైనిక స్థావర భద్రతలకు వీటిని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో భారత్​కు.. ప్రిడేటర్​-బి డ్రోన్లను ఇవ్వనుంది అమెరికా. ఈ డ్రోన్లు నిఘాకే కాకుండా లక్ష్యాలను నాశనం చేయటానికి ఎంతో ఉపయోగపడతాయి.దాడి చేయగల నాలుగు డ్రోన్లను తన మిత్రదేశం పాకిస్థాన్‌కు చైనా సరఫరా చేయనుందని తెలిసింది. రెండు దేశాల ఆర్థిక నడవా, గ్వదర్‌ పోర్టు వద్ద డ్రాగన్‌ కొత్తగా ఏర్పాటు చేసిన సైనిక స్థావరం భద్రతకు వీటిని ఉపయోగించనున్నారు. చైనా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పాకిస్థాన్ ద్వారా వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే పాక్‌ ఈ డ్రోన్లను ఇతర అవసరాలకూ వినియోగించే ఆస్కారం లేకపోలేదు!

 

 

సైనిక అవసరాల కోసం వింగ్‌ లూంగ్‌ 2 డ్రోన్లను చైనా తయారుచేసింది. వీటినే పాకిస్థాన్‌ వైమానిక దళం ఉపయోగిస్తోంది. తాజాగా 48 జీజే-2 డ్రోన్లను ఉత్పత్తి చేయాలని బీజింగ్‌ తలపెట్టింది. ఇవి గాల్లోంచి నేలమీదకు ప్రయోగించగల 12 క్షిపణులు మోసుకెళ్లగలవు. ఆసియాలో చాలా దేశాలకు ఈ డ్రోన్లను చైనా విక్రయించింది. అయితే, ఇవి అనుకున్న మేరకు విజయవంతమైన దాఖలాలు కనిపించలేదు. గత రెండు నెలల కాలంలో లిబియాలో ఇలాంటివి నాలుగు డ్రోన్లు హఠాత్తుగా నేలకూలాయి.

 

 

పాకిస్థాన్‌కు చైనా డ్రోన్లను ఇస్తున్న నేపథ్యంలో అమెరికాకు చెందిన మీడియం ఆల్టిట్యూడ్‌ లాంగ్‌ ఎండ్యూరన్స్‌‌ (మేల్‌) సాయుధ ప్రిడేటర్‌-బి డ్రోన్లపై భారత్‌ ఆసక్తి కనబరుస్తోంది. ఇవి నిఘా పెట్టి సమాచారం సేకరించడమే కాకుండా క్షిపణులు, లేజర్‌ గైడెడ్‌ బాంబుల ద్వారా లక్ష్యాలను నాశనం చేయగలవు. ఆయుధ రహిత ప్రిడేటర్ల కోసం భారత నౌకదళం చర్చలు జరుపుతుండగా అన్ని అవసరాలు తీర్చగలిగేవి తీసుకుంటే మంచిదని జాతీయ భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌, సిరియాలో విజయవంతమైన ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్లపై భారత్‌ ఆసక్తి ప్రదర్శిస్తోంది. క్షిపణులతో పాటు 500 పౌండ్ల బరువుండే రెండు లేజర్‌ గైడెడ్‌ బాంబులను ఇవి మోసుకెళ్లగలవు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: