తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కు సరైన ప్రత్యర్ధి ఎవరు అనే ప్రశ్న తలెత్తితే...ఎవరు లేరనే చెప్పొచ్చు. అసలు కేసీఆర్కు చెక్ పెట్టగలిగే ధీటు అయిన నాయకుడు ప్రతిపక్ష పార్టీల్లో కనిపించడం లేదు. కానీ గులాబీ పార్టీ అంటే ఇష్టపడని వారికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీద ఆశలు ఉన్నాయి. ఏ నాటికైనా కేసీఆర్కు చెక్ పెట్టేది రేవంత్ అనే ధీమాలో ఉన్నారు.
వాస్తవానికి చెప్పాలంటే కేసీఆర్కు కాస్త పోటీ ఇవ్వగలిగేది రేవంత్ రెడ్డినే. అసలు ఆయన టీడీపీలో ఉన్న దగ్గర నుంచి, కేసీఆర్పై ఒంటికాలి మీద వెళుతూనే ఉన్నారు. అప్పటిలో చంద్రబాబు స్వేచ్ఛ ఇవ్వడంతో, రేవంత్ కేసీఆర్కు చెక్ పెట్టడానికి శతవిధాలా ప్రయత్నించారు. కానీ అనూహ్యంగా కేసీఆర్ వ్యూహంలో చిక్కుకుని రేవంత్ ఓటుకు నోటు కేసులో జైలు పాలయ్యారు. ఇక బయటకొచ్చిన తర్వాత కూడా రేవంత్, కేసీఆర్ని వదిలిపెట్టకుండా పక్కలో బల్లెం మాదిరిగా నడుచుకున్నారు.
కానీ టీడీపీలో ఉంటే భవిష్యత్ కష్టమని భావించి కాంగ్రెస్లోకి వచ్చి కేసీఆర్పై పోరాటం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్లోని పెద్దలు రేవంత్కు ఎక్కడికిక్కడ చెక్ పెడుతుండటంతో, రేవంత్ ఆటలు అనుకున్నమేర సాగడం లేదు. కాకపోతే తనకు సాధ్యమైన మేర కేసీఆర్కు చుక్కలు చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఇలాంటి తరుణంలోనే రేవంత్కు కరోనా రూపంలో మంచి అవకాశం దొరికింది. తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.
అయితే మొదట్లో కరోనా కట్టడిపై కేసీఆర్ భారీ డైలాగులు వేసి, కాస్త హడావిడి చేశారు. కానీ ఆయన మాటలు చెప్పిన మాదిరిగా కరోనా కట్టడి జరగలేదు. బీభత్సంగా కరోనా పెరిగిపోతుంది. ఇదే సమయంలో కరోనా కట్టడి చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అలాగే ఈ విషయంలో రాష్ట్ర ప్రజలు కూడా కాస్త అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. ఇక దీన్ని రాజకీయ అవకాశంగా మలుచుకోవడానికి కేసీఆర్..రేవంత్కు ఒక ఛాన్స్ ఇచ్చారని, దాన్ని ఉపయోగించుకుని రేవంత్ క్లిక్ అయితే తిరుగుండదని విశ్లేషుకులు అంటున్నారు. కానీ రేవంత్కు సొంత పార్టీ కాంగ్రెస్తోనే కష్టమని, ఆ పార్టీ నేతలు రేవంత్ని వెనక్కి లాగడం ఖాయమని చెబుతున్నారు.