గత కొద్దిరోజులుగా, తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడా? అంటూ విపక్షాలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సహా బీజేపీ, టీడీపీ ఇతర పార్టీ ఈ మేరకు విరుచుకుపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో సహజంగానే కేసీఆర్ జాడ ఎక్కడ అనే సందేహం వస్తోంది. తాజాగా దీనికి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ జెడ్పీటీసీ నాగం భూమయ్య, మేడిపల్లి మండల రైతుబంధు సమితి జిల్లా కార్యవర్గ సభ్యుడు, వెంకట్రావుపేట మాజీ సర్పంచ్ కాటిపెల్లి శ్రీపాల్రెడ్డికి నేరుగా ఫోన్చేసి మాట్లాడారు. మధ్యమానేరు ప్రాజెక్టు సమస్యలను పరిష్కరించినట్టే ఇప్పుడు వరదకాలువ ద్వారా జగిత్యాల జిల్లా కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో పొలాలకు సాగునీరందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను స్వయంగా అక్కడి రైతులకు ఫోన్చేసి ఆరా తీశారు.
‘మీ గ్రామాల పొలాలకు నీళ్లిద్దాం.. ఎలా చేస్తే లాభమో చెప్పండి’ అంటూ స్వయంగా సీఎం కేసీఆర్ వివరాలు అడిగారు. వరదకాలువ ద్వారా ఒనగూరుతున్న ప్రయోజనాలు.. రైతులకు నీళ్లందుతున్నతీరు, ఇంకా పరీవాహక ప్రాంతాల రైతుల అవసరాలు తదితర అంశాలపై వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ నాగం భూమయ్య కథలాపూర్లోని విషయాలను వివరించారు. పునర్జీవ పథకంతో మండలంలోని తక్కల్లపల్లి, సిరికొండ, బొమ్మెన, కథలాపూర్ గ్రామాల ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. అయితే, వరదకాలువకు ఎగువనున్న మరో 12 గ్రామాలకు లిప్టుద్వారా నీళ్లిస్తే.. ఆ గ్రామాల రైతుల కష్టాలు తీరుతాయని విజ్ఞప్తిచేశారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్.. పూర్తి వివరాలు మాట్లాడేందుకు రెండు మూడురోజుల్లో హైదరాబాద్ రమ్మని ఆహ్వానించారని జెడ్పీటీసీ తెలిపారు.
కాగా, శ్రీరాంసాగర్ పునర్జీవ పథకం కింద ఇప్పటికే వేలమంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. 122 కిలోమీటర్ల పొడవున్న వరద కాలువను ఇప్పటికే నాలుగు రిజర్వాయర్లుగా చేసి.. 34 తూముల ద్వారా చెరువులను నింపుతున్నారు. దీనిద్వారా పరీవాహక ప్రాంతంలో భూగర్భజలాలు పెరిగిపోయాయి. అయితే.. వరద కాలువ దిగువ భూములకు తూముల ద్వారా నీళ్లందుతుండగా.. ఎగువ గ్రామాలకు కూడా నీళ్లివ్వాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. దానిపై దృష్టి సారించారు. కాగా ,గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారం, చర్చకు చెక్ పెట్టి ఓన్లీ ఫసక్ అన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారని పేర్కొంటున్నారు.