వికాస్ దూబే....దేశంలో ఈ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. కాన్పూర్ ఎన్కౌంటర్లో ఎనిమిది మందిని పొట్టనపెట్టుకున్న దుర్మార్గుడు. ఈ ఘటన తర్వాత వికాస్ దూబే తప్పించుకుని తిరుగుతున్నాడు. అతడి కోసం తీవ్రంగా గాలించిన యూపీ పోలీసులు చివరికి సక్సెస్ అయ్యారు. కాగా, ఇప్పటికే వికాస్ దూబే ముగ్గురు ప్రధాన అనుచరులను పోలీసులు హతం చేశారు. నిన్న వికాస్ దూబే రైట్ హ్యాండ్ అమర్ దూబేని ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు ఈరోజు మరో ఇద్దరు అనుచరులను ఎన్ కౌంటర్ చేశారు. అయితే, వికాస్ ఉదంతంలో పోలీసులు తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారి సజ్జనార్ పేరును తెరమీదకు తీసుకువస్తున్నారు.
కాన్పూర్ ఎన్కౌంటర్ తర్వాత తప్పించుకున్న తిరుగుతున్న వికాస్ దూబే యూపీ పోలీసులకు చిక్కకుండా చక్కర్లు కొట్టాడు. హర్యానా, నోయిడా ప్రాంతాల్లో కనిపించినట్లు కనిపించి మాయం అయ్యాడు. అయితే ఇవాళ ఉదయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాలేశ్వరుడి సన్నిధిలో పోలీసులకు చిక్కిపోయాడు. అయితే, ఆయన అరెస్టుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మహాకాలేశ్వరుడి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన వికాస్ దూబే.. తానే స్వయంగా అక్కడ ఉన్న సెక్యూర్టీకి లొంగిపోయినట్లు తెలుస్తున్నది. పోలీసులకు కూడా తన గురించి సమాచారం ఇవ్వాలని ఆ సెక్యూర్టీ గార్డులకు చెప్పినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తున్నది. టెంపుల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో .. నేనే వికాస్ దూబేను.. కాన్పూర్వాలా అంటూ అరిచాడు. వికాస్ చిట్టచివరకు అరెస్టయ్యాడని పోలీసులు చెప్తుంటే... తనంతట తానే లొంగిపోయినట్లు చెప్పుకున్నాడు.
మరోవైపు వికాస్ దూబే కేసు విషయంలో యూపీ పోలీసులు విఫలమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. వికాస్ను పట్టుకోలేకపోయిన పోలీసులు.. అతని తలపై రివార్డును పెంచుతూ పోయారు. తొలుత 50 వేల నుంచి .. చివరకు 5 లక్షల వరకు రివార్డును పెంచేశారు. కాగా, వికాస్ అరెస్టు లొంగిపోవడంపై క్లారిటీ ఇవ్వాలని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. వికాస్ మొబైల్ ఫోన్ ఆధారంగా పోలీసులతో ఉన్న లింకులను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ఇప్పుడు యూపీ పోలీసుల బండారం బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇలా వివాదం ముదురుతుండటం, రాజకీయ ఒత్తిళ్లు, తమ సభ్యులను కాల్చి చంపిన తీరుతో....యూపీ పోలీసులు వికాస్ను ఎన్కౌంటర్ చేయవచ్చని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. తెలంగాణలో సంచలన ఎన్కౌంటర్ చేసిన సీపీ సజ్జనార్ రీఎంట్రీ ఇచ్చి ఈ దుర్మార్గుడిని మధ్యప్రదేశ్ నుంచి యూపీ తరలిస్తుండగా ఎన్కౌంటర్ చేయాలని ఇంకొందరు డిమాండ్ చేస్తుండటం గమనార్హం.