కరోనా మహమ్మారి భారత్లో బీభత్సంగా పెరిగిపోతుంది. మూడు నెలల క్రితం భారత్ ని అన్ని దేశాలు ఆదర్శంగా తీసుకున్న విషయం తెలిసిందే. అలాంటిది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో భారత్ మూడో స్థానానికి చేరుకుందంటే.. ఇక్కడ కేసులు.. మరణాల సంఖ్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవొచ్చు. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 24,879 మందికి కొత్తగా వ్యాధి లక్షణాలను గుర్తించారు. 487 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 7,67,296కు చేరగా.. మరణాలు 21,129కు పెరిగాయి. 4,76,378 మంది వైరస్ను జయించి ఇంటికి వెళ్లిపోయారు. ఇంకా 2,69,789 మందికి చికిత్స కొనసాగుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 12,164,119 మంది వైరస్ బారిన పడ్డారు.
వీరిలో 5,52,023 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 5.5 మిలియన్ల యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా కరోనా మహారాష్ట్రలో బీభత్సం సృష్టిస్తుంది. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ర్ట ప్రభుత్వం అప్రమత్తమైంది. బెంగళూరులో కరోనాను తరిమికొట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో క్రమంలో సీఎం యెడియూరప్ప నేతృత్వంలో మంత్రివర్గం సమావేశమై కరోనా కట్టడికి తీసుకోవాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది.
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా బెంగళూరు సిటీని 8 జోన్లుగా విభజించాలని సీఎం నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి జోన్ కు ఒక మంత్రి బాధ్యత వహించి.. కొవిడ్ నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తారని చెప్పారు. గురువారం సాయంత్రం వరకు కర్ణాటకలో 28,877 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో బెంగళూరు అర్బన్ నుంచి 12,509 కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. తాలుకా, జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో కూడా కరోనా టెస్టులు చేసేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకుంటామని.. సీఎం రాజకీయ కార్యదర్శి ఎస్ఆర్ విశ్వనాథ్ కూడా భాగస్వాములు అవుతారని మధుస్వామి పేర్కొన్నారు.