ఏపీ సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొన్ని రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వేలకోట్ల రూపాయలు వెచ్చించడానికి కూడా ఏమాత్రం వెనుకాడటం లేదు. పేద ప్రజల జీవితాల్లో మౌలిక మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. అందులో ఒకటి అమ్మఒడి పథకం. ప్రభుత్వ పాఠశాలల తలరాత మార్చడమే దీని లక్ష్యం.
అందుకే పాఠశాలల అభివృద్ధి కోసం నాడు-నేడు పథకం తీసుకొచ్చారు. తాజాగా ఈ రంగంపై సమీక్ష నిర్వహించిన జగన్.. అధికారులకు టార్గెట్ ఫిక్స్ చేశారు. ఏడాదిన్నరలో నాడు నేడు పథకం కింద చేపడుతున్న అన్ని పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులపై ప్రభుత్వం కన్న కల నిజం కావాలని, సంవత్సరన్నరలోగా విద్యారంగంలో `నాడు-నేడు` కింద చేపడుతున్న పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు.
స్కూల్స్, ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమంపై, వాటర్ గ్రిడ్, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు నిధుల అనుసంధానంపై సమీక్షించిన జగన్... నిధుల సమీకరణపై కచ్చితమైన ప్రణాళిక ఉండాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయంలోగా లక్ష్యాలు, అంతే వేగంతో పనులు జరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. `నాడు-నేడు` కార్యక్రమం అత్యంత ప్రధానమైందని సీఎం వైయస్ జగన్ వివరించారు.
ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో కూడా నాడు-నేడు, కొత్తగా నిర్మించే నిర్మాణాలు అత్యంత ముఖ్యమైనవని జగన్ చెబుతున్నారు. అవును మరి వేల కోట్ల రూపాయలు కేటాయించడమే కాదు.. వాటి ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షించకపోతే .. చివరకు అంతిమ లక్ష్యం చేరుకోవడం కష్టమవుతుంది.