ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కరోనా వచ్చిన తర్వాత బయటకు రావడం బాగా తగ్గించేశారు. ఏదేమైనా జూమ్ యాప్ ద్వారా అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం.. నేనూ ఉన్నా అనిపించుకోవడం చేస్తున్నారు. అయితే ఈ విమర్శల్లో కొన్ని కెలికి మరీ వైసీపీ నాయకులతో తిట్టించుకుంటున్నట్టు ఉంటున్నాయి. చంద్రబాబు హయాంలో రైతులకు ఎలాంటి మేలు జరిగిందో వాటిని అనుభవించిన రైతులకు తెలియంది కాదు.
రుణమాఫీ హామీ ఇచ్చినా.. విడతల వారీగా ఐదేళ్లలోనూ పూర్తిగా చెల్లించని చరిత్ర చంద్రబాబుకు ఉంది. ఇప్పుడు జగన్ రైతులకు సున్నా వడ్డీకి రుణాలు ఇస్తూ.. తన తండ్రి జయంతిని రైతు దినోత్సవంగా జరిపారు. దీనిపై చంద్రబాబు విమర్శిస్తూ.. ఇది రైతు దినోత్సవం కాదు.. రైతు దగా దినోత్సవం అంటూ విమర్శించారు. దీంతో వైసీపీ నేతలు నోటికి పని చెబుతున్నారు.
ఇక వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అయితే ఓ రేంజ్లో చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. మోసానికి, ద్రోహానికి చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని మంత్రి కన్నబాబు మండిపడుతున్నారు. తన ఐదేళ్ల పాలనలో రైతులకు ద్రోహం చేశారని, వ్యవసాయాన్ని దండగ చేస్తే..సీఎం వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక పండుగ చేస్తున్నారని మంత్రి కన్నబాబు చెప్పారు. చంద్రబాబు రైతులకు పెట్టిన బకాయిలను కూడా వైయస్ జగన్ చెల్లించారని మంత్రి కన్నబాబు తెలిపారు.
రైతులకు రుణాలు మాఫీ చేస్తానని ఓట్లు వేయించుకుని మోసం చేశారని మంత్రి కన్నబాబు అన్నారు. ఆయన రైతులపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రుణాలు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. పంట రుణాలపై వడ్డీలు చెల్లించకుండా చంద్రబాబు అన్యాయం చేస్తే..వాటిని సీఎం వైయస్ జగన్ చెల్లించారన్నారు. రైతులకు బాబు చేసిన ద్రోహం ఎవరూ మరవరన్నారు. చంద్రబాబు కట్టుకథలు నమ్మే పరిస్థితిలో జనం లేరని మంత్రి కన్నబాబు అంటున్నారు.