కరోనా మహమ్మారితో ప్రపంచమంతా ఆర్థిక సంక్షోంభంలోకి జారుకుంది. ప్రపంచానికి తన ఎగుమతులతో ముంచెత్తిన చైనా ఇప్పుడు నిధుల లేమితో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. లక్షలాది కోట్లతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు ఇప్పుడు చైనా ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయి. అదే సమయంలో బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మిగతా దేశాల నుంచి ఎగుమతులు..దిగుమతులు లేకపోవడంతో పాటు పారిశ్రామికంగా, సేవాల రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. ఐరోపా దేశాల కన్నెర కూడా కొనసాగుతోంది. అమెరికా అయితే చైనా పేరెత్తితే అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఇలాంటి ప్రమాదకర ఆర్థిక పరిస్థితుల నుంచి బయట పడాలంటే పొదుపు ఒక్కటే మార్గమని భావిస్తోందంట.
అయితే బ్యాంకుల్లో బ్యాడ్లోన్స్ పెరిగిపోయాయనే కారణం చూపుతూ ప్రజలు పెద్ద మొత్తంలో నగదు ఉపసంహరించు కుంటున్నారు. దీంతో చైనా ప్రభుత్వం కూడా వెంటనే అప్రమత్తమైంది. భారీ లావాదేవీలపై పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఆంక్షలు విధించడం గమనార్హం.పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పైలట్ ప్రాజెక్టుగా హెబీ ప్రావిన్స్లో ఈ నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం వ్యక్తిగత, బిజినెస్ ఖాతాదారులు ఎవరైనా పెద్దమొత్తంలో నగదును ఉపసంహరించుకోవాలన్నా లేదా డిపాజిట్ చేయాలన్నా ముందుగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనాకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ పరిమితి 3,00,000 యువాన్ల వరకు ఉండే అవకాశం ఉన్నది.
వ్యక్తిగత బ్యాంకు ఖాతాదారులు నిర్వహించే లావాదేవీ విలువ 1,00,000 యువాన్లు దాటితే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. బిజినెస్ ఖాతాదారులు 5,00,000 యువాన్లకు మించి లావాదేవీలు జరిపితే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. బ్యాడ్ లోన్స్ పెరిగిపోయాయి. బ్యాంకుల్లో నగదు నిల్వలు తరిగిపోయాయి. ఈ నేపథ్యంలో చైనా బ్యాంకుల్లో భారీస్థాయి లావాదేవీలపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది.
చైనాకు సంబంధించిన దాదాపు 500 రకాల వస్తువులను నిషేధించేందుకు జాబితాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇందులో రోజువారీ వినియోగ వస్తువులు, బొమ్మలు, దుస్తులు, బిల్డర్ హార్డ్వేర్, పాదరక్షలు, వంటగది సామాను, చేతి సంచులు, సౌందర్య సాధనాలు, బహుమతి వస్తువులు, ఎలక్ట్రికల్ పరికరాలు, ఆహార పదార్థాలు మొదలైనవి ఉన్నాయి.