అటు ప్రపంచవ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రోజుకు వేలాది కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో 7.67 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు, 21 వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. అయితే, తాజాగా షాకింగ్ వార్త తెరమీదకు వస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం యాక్టివ్ కేసులలో కేవలం ఎనిమిది రాష్ట్రాల నుంచే 90 శాతం ఉన్నాయని తేలింది. ఢిల్లీలో జరిగిన మంత్రుల బృందం 18వ సమావేశం అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ మీడియాకు వెల్లడించింది. కేవలం 49 జిల్లాల్లోనే 80 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. 80 శాతం కరోనా మరణాలు 32 జిల్లాల్లోనే నమోదయ్యాయని ఆయన వివరించారు.
దేశంలో నమోదైన మొత్తం మరణాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోనే 86 శాతం ఉన్నట్లు వెల్లడించింది. కేవలం ఆరు రాష్ట్రాల నుంచే 86 శాతం కరోనా మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం కరోనా యాక్టివ్ కేసులలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోనే 90 శాతం ఉన్నాయని వెల్లడించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతి మిలియన్ మందికి 1453 మంది కరోనా మహమ్మారి బారినపడితే దేశంలో మాత్రం ఆ సంఖ్య 538గా ఉందని ఆరోగ్య మంత్రి చెప్పారు. కాగా, భారీగా కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్న వాటిలో దక్షిణాది రాష్ట్రాలు ఉండటం, అందులోనూ మన తెలుగు రాష్ట్రాలు ఉండటం సంచలనంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా మరణాలు సైతం ప్రపంచ సగటుతో పోల్చితే భారత్లో తక్కువగా నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మిలియన్ మందికి 68.7 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతే దేశంలో మాత్రం ప్రతి మిలియన్ మందికి మరణించిన కరోనా రోగుల సంఖ్య 15గా ఉంది. కాగా, ప్రజలంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.