ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు అండ్ బ్యాచ్‌పై విమర్శలు చేస్తూ, సెటైర్లు వేసే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మధ్య బీజేపీని కెలుకుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేసిన దగ్గర నుంచి, విజయసాయి..కన్నాని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. కన్నా కూడా బాబు డైరక్షన్‌లోనే పనిచేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

 

ఇక తాజాగా కూడా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుని టీడీపీ...తమ హయాంలో కట్టిన ఇళ్లని పేద ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేయగా, దీనిపై విజయసాయిరెడ్డి స్పందించి, టీడీపీపై విమర్శలు గుప్పించారు. పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని అడ్డుకుని, ఇప్పుడు హడావిడి చేస్తున్నారన్నట్లు మాట్లాడారు. అలాగే నిర్మాణం పూర్తి కాని ఇళ్లను పంపిణీ చేయట్లేదని పచ్చ పార్టీ ఆందోళనకు దిగడంపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు కడిగి పారేశారని, కానీ బాబు ఎక్కడ హర్ట్ అవుతాడో అని కన్నా సైలెంటయ్యారని విజయసాయి సెటైర్లు వేశారు.

 

దీంతో బీజేపీ నేతలు వరుస పెట్టి విజయసాయిపై ఫైర్ అవుతున్నారు. బీజేపీ విషయాలు పట్టించుకోవడం మానేసి మీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో వినండి అంటూ మండిపడుతున్నారు. అయితే అంతకముందు కూడా ఏపీ బీజేపీని బాబు కబళించేస్తున్నారు అన్నట్లు మాట్లాడారు. ఇక దానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ సునీల్ దేవధర్ గట్టిగానే స్పందించారు.

 

రఘురామకృష్ణమ రాజు వ్యవహారంతో మీ పార్టీ రంగు మారుతోందని అది చూసుకోవాలని, పసుపు మాత్రమే కాదు అన్ని రంగులను కూడా కాషాయం చేస్తామని ఆయన అన్నారు. ఇక ఈ విధంగా విజయసాయి బీజేపీని కెలకడంతో అంతా రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి కేంద్ర సాయం చాలా రావాల్సి ఉందని, పైగా మండలి రద్దు, ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు లాంటి పనులు బీజేపీ చేతిలోనే ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయి బీజేపీతో కయ్యం పెట్టుకుంటే పనులు అవ్వడం కష్టమని వైసీపీ అనుకూల వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: