కోట్లాది రూపాయలు కొల్లగొట్టి బ్రిటన్లో తలదాచుకుంటున్న విజయ్మాల్యాను భారత్ బ్యాంకులు వెంటాడుతున్నాయి. అతగాడిని దివాలాకోరుగా ప్రకటించాల్సిందేనంటూ మరోసారి ఇంగ్లండ్ హైకోర్టులో ఎస్ బీఐ నేతృత్వం లోని 13 బ్యాంకుల కన్సార్షియం తమవాదనల్ని వినిపించింది. మాల్యాను దివాలాకోరుగా ప్రకటిస్తేనే...రుణాలు రాబట్టుకోవచ్చని బ్యాంకులు ఆశగా ఎదురు చూస్తున్నాయి.
భారత్ నుంచి బ్రిటన్ కు పరారైన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కోసం, దేశంలోని 13 బ్యాంకులు పడరాని పాట్లు పడుతున్నాయి. మాల్యా ఎగ్గొట్టిన డబ్బుల్ని తిరిగి రాబట్టుకునేందుకు ఇంగ్లండ్ హైకోర్టును ఆశ్రయించాయి. మాల్యా ఎగ్గొట్టిన సొమ్ము 114.5 కోట్ల పౌండ్లు .. మన కరెన్సీలో 10వేల కోట్ల పైమాటే. అతన్ని నుంచి డబ్బులు వసూలు చేసుకునే క్రమంలో, బ్యాంకింగ్ కన్సార్షియం 2018లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది.
అయితే లిక్కర్ కింగ్ మాల్యా భారత్లోని పలు కోర్టుల్లో తనపై కేసులు విచారణ దశలో ఉన్నాయని, ఆ కేసుల్లో తాను విజయం సాధించే అవకాశాలూ ఉన్నాయంటూ ఇంగ్లండ్ కోర్టుల్లో వాదించాడు. పైగా తనకు ఇచ్చిన రుణాల విషయంలో బ్యాంకులకు పూర్తి గ్యారంటీ ఉందని సమర్ధించుకున్నాడు.రుణ చెల్లింపుల పరిష్కారానికి తాను ఇచ్చిన ఆఫర్లను బ్యాంకింగ్ పట్టించుకోవడంలేదని కోర్టు దృష్టికి తెచ్చాడు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న లండన్ కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ బ్రిగ్స్ మాల్యాపై పిటిషన్ను ఈ ఏడాది ఏప్రిల్ 10న కొట్టివేశారు.
అయితే ఈ తీర్పుపై భారత్ బ్యాంకింగ్ కన్సార్షియం ఇటీవలే అమెండెడ్ పిటిషన్ దాఖలు చేసింది. మాల్యా చెబుతున్న అంశాల్లో నిజాలు లేవని ఈ పిటిషన్లో వివరించింది. యూబీహెచ్ ఎల్ సెటిల్మెంట్ ఆఫర్ అమలుకు సాధ్యం కాదని పేర్కొంది. ఈ ఆస్తులు అధికారిక లిక్విడేటర్ కింద ఉన్నాయని, మాల్యాకు, ఒకప్పటి యూబీహెచ్ ఎల్ యాజమాన్యానికి ఇవి అందుబాటులో లేవని తేల్చింది. మాల్యా చెప్పుకున్నట్లు బ్యాంకులు సెక్యూర్డ్ క్రెడిటార్స్ కాదని.. బ్యాంకింగ్ కన్సార్షియం తరఫు బారిష్టర్ షేక్డీమియన్ లండన్ కోర్టులో వాదించారు.
మాల్యా తరఫు లీగల్ టీమ్ బ్యాంకులు సెక్యూర్ట్ క్రెడిటార్స్ అనీ, బ్యాంకింగ్ తాజా పిటిషన్నూ కొట్టేయాలని తన వాదనలను వినిపించింది. బ్యాంకింగ్ తరఫు న్యాయవాది ..భారత్కు తనను అప్పగించరాదంటూ మాల్యా చేసిన వాదనలూ, బ్రిటన్ న్యాయస్థానాల్లో వీగిపోయిన విషయాలను ఇంగ్లండ్ హైకోర్టుకు దృష్టి తెచ్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ బ్రిగ్స్ తీర్పును రిజర్వ్ చేశారు.