ఈనెల 22వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందనే లీకుల తో ఎవరికి వారు మంత్రివర్గ విస్తరణలో తమ పేరు ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు తమకు అవకాశం ఉన్న అన్ని దారులను వెతుక్కుంటూ,
మంత్రి పదవి సంపాదించే విషయంలో పై మెట్టు సాధించాలని చూస్తున్నారు. మొదటి నుంచి
వైసీపీ నమ్ముకుని ఉన్న వారంతా, మొదటి విడత మంత్రివర్గ విస్తరణ లో అవకాశం దక్కకపోవడంతో, రెండో విడత అయినా
జగన్ కరుణ తమ మీద ఉంటుంది అనే అభిప్రాయంతో ఉన్నారు. ఇక
మంత్రి పదవి కాకుండా, వేరే పదవులు అనుభవిస్తున్న వారు ఇప్పుడు
మంత్రి కావాలని తహతహలాడుతున్నారు. ముఖ్యంగా
ఏపీ స్పీకర్ గా ఉన్న మాజీ
మంత్రి తమ్మినేని సీతారాం మంచి వాగ్దాటి ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. సమకాలీన రాజకీయ అంశాల పైన ఆయనకు పట్టుంది. ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో ఆయన దిట్ట. అలాగే ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. కానీ అనూహ్యంగా ఆయనకు
మంత్రి పదవి కాకుండా, స్పీకర్ పదవిని కట్టబెట్టడం తో దూకుడుగా వ్యవహరించలేకపోతున్నారు. కానీ
మంత్రి అవ్వాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో ఎక్కువగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆయన కొన్ని కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ విమర్శల పాలవుతున్నారు. రాజ్యాంగ పదవులు భ్రష్టు పట్టిస్తున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. స్పీకర్ పదవి పూర్తిగా రాజకీయ పరంగా మారిపోతున్నాయి అనే విమర్శలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతంలో
టిడిపి ప్రభుత్వ హయాంలో స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు వ్యవహారాన్ని
వైసిపి అప్పట్లో పెద్ద రాద్దాంతం చేసింది. ఇప్పుడు తమ్మినేని కూడా రాజకీయ విమర్శలు చేస్తుండడంతో
వైసీపీ కాస్తా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే తమ్మినేని ఈ విధంగా స్పీడ్ అవ్వడానికి కారణం ఆయనకు
మంత్రి అవ్వాలనే కోరిక బలంగా ఉండడం. ఆయన దూకుడు ప్రదర్శించడం వెనుక కూడా అదే కారణంగా కనిపిస్తోంది.
తమ్మినేని సీతారాం కు
మంత్రి పదవి కట్టబెడితే, రాజకీయ శత్రువుల పై విమర్శలు చేయడంలో ముందుంటారని , ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మాన కృష్ణదాస్ మెతక వైఖరి తో ఉండడంతో శ్రీకాకుళంలో అచ్చెన్న వంటి నాయకులు దూకుడు ఎక్కువగా ఉందని, తమ్మినేని సీతారాం వంటి వారికి
మంత్రి పదవి అప్పగిస్తే.. అచ్చెన్న వంటి వారి దూకుడుగా ఎదుర్కోగలరు అనే అభిప్రాయాన్ని
జగన్ లో కలిగించేందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది అంటూ ఇప్పుడు సొంత
పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.