ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో 8మంది పోలీసుల మృతికి కారణమైన కేసులో ప్రధాన నిందితుడు, మోస్టు వాటెండ్ క్రిమినల్ వికాస్ దూబే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో గురువారం ఉదయం పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. జూన్ 3న కాన్పూర్ పోలీసులు హత్య కేసులో వికాస్ దూబేను అరెస్టు చేసేందుకు బిక్రూ గ్రామానికి వెళ్తుండగా వారి వాహనానికి దూబే అనుచరులు భూమిని చదును చేసే యంత్రాన్ని అడ్డుపెట్టి వాహనాల చాటు నుంచి పోలీసులపైకి కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ డిప్యూటీ ఎస్పీస్థాయి అధికారితోపాటు, ముగ్గురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు మృతి చెందారు. దాంతో ఈ కేసు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సీరియస్ గా తీసుకున్నారు.
నాటి నుంచి దూబే పరారీలో ఉండగా పోలీసులు 40బృందాలుగా ఏర్పడి అతడి ఆచూకీ కనుగొనే పనిలో పడ్డారు. శుక్రవారం హర్యానాలో పోలీసుల కంటపడిన దూబే చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు. అయితే ఇతని అనుచరులను పట్టుకోవడం.. ఐదుగురిని ఎన్ కౌంటర్ చేయడం కూడా జరిగిపోయింది. దాంతో దుబే ఇక తనను ఎన్ కౌంటర్ చేస్తారిన భయపడ్డాడు.. దాంతో పక్కా ప్లాన్ తో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో కావాలనే పోలీసులుకు పట్టుబడ్డాడు. తాను పట్టుబడ్డా.. చట్టాన్ని అడ్డు పెట్టుకొని తప్పించుకోవొచ్చు అన్న కోణంలో దుబే ఆలోచించినట్లు కనిపించింది.
కాగా, మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా దూబే అరెస్టును ద్రువీకరించారు. ఇక గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. కరడుగట్టిన నేరస్తుడు వికాస్ దూబే నిన్న ఉదయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీలో పోలీసులకు చిక్కాడు. అక్కడి నుంచి భారీ భద్రతతో స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు కాన్పూర్కు తరలిస్తున్నారు. కాన్వాయ్లోని ఓ కారు కాన్పూర్ సమీపంలో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు బోల్తా పడింది.
ఇదే అదునుగా ఆయుధం లాక్కొని దుబే పారిపోవడానికి ప్రయత్నించాడట.. వెంటనే లొంగిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించినా వినకపోవడంతో ఆత్మరక్షణ కోసం ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని వారు అంటున్నారు. మొత్తానికి దుబే జీవితం.. కాల్పులు.. ఛేజింగ్.. ఎన్ కౌంటర్.. థ్రిల్లర్ మూవీ తలపిస్తుందని నెటిజన్లు అంటున్నారు.