గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. కరడుగట్టిన నేరస్తుడు వికాస్ దూబే నిన్న ఉదయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీలో పోలీసులకు చిక్కాడు. అక్కడి నుంచి భారీ భద్రతతో స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు కాన్పూర్కు తరలిస్తున్నారు. అక్కడ వాహనం బోల్తా పడటం.. తప్పించుకునే ప్రయత్నంలో వికాసు దుబేని ఎన్ కౌంటర్ చేయడం.. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దూబేను ఆసుపత్రికి తరలించేలోపే అతను మరణించాడని ఈ విషయాన్ని స్పష్టం చేసిన కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్, జరిగిన ఘటనలో వికాస్ దూబే హతుడయ్యాడని వెల్లడించారు.
ఇక గ్యాంగ్స్టర్ వికాస్ దూబే నేర చరిత్ర ఇప్పటిది కాదని.. చిన్ననాటి నుంచి నేర పూరితమైన మైండ్ సెట్ తో పెరిగాడని సహచరులు.. చుట్టుపక్కల వారు తెలిపారు. ఇంటర్ చదువుతున్న సమయంలో అతను కాలేజీకి తపంచా పట్టుకుని వెళ్లేవాడు అని తెలిసింది. చిన్ననాటి నుంచి తన మేనమామ ఇంటి వద్ద పెరిగాడు. తన దగ్గర ఉన్న నాటు తుపాకీతో తోటి విద్యార్థులను, టీచర్లను బెదిరించేవాడు. 14 ఏళ్ల వయసులోనే వికాస్.. టీచర్లపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ రోజు కాలేజీ ప్రిన్సిపల్ వికాస్ నుంచి పిస్తోల్ లాక్కున్నాడు.
ఆ రోజు అతన్ని టీచర్లు కొట్టారు కూడా. ఆ మరుసటి రోజు వికాస్.. తనను కొట్టిన టీచర్లను దారిలో అటాక్ చేశాడు. ఇంటర్ పూర్తయ్యాక రేడియో మెకానిక్ గా జీవితం ఆరంభించాడని.. అదే సమయంలో చిన్న చిన్న నేరాలు చేస్తూ క్రిమినల్ గా మారాడని అంటున్నారు. అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో.. మామ ప్రేమ్కిషోర్ అతన్ని ఇళ్లు వదిలి వెళ్లమన్నాడు. అప్పుడు అతను బికారూ గ్రామానికి వచ్చి సెటిలయ్యాడు. మంత్రి సంతోష్ శుక్లా మర్డర్ కేసులో అతను నిందితుడిగా ఉన్నాడు.
కానీ ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. వికాస్ దూబేపై సుమారు 60 కేసులు ఉన్నట్లు యూపీ పోలీసులు చెప్పారు. వికాస్ దూబే పాపాలు పరాకాష్టకు చేరాయి.. అరెస్ట్ చేయాలని వెళ్లిన పోలీసుల బృందంపై అటాక్ చేసి 8 మందిని పొట్టనబెట్టుకున్నాడు. తుపాకీ పట్టిన వాడు ఆ తుపాకీతోనే పోతాడు అన్నదానికి ప్రత్యక్ష సాక్షిగా వికాస్ దూబే కన్నుమూశాడు.