ప్రస్తుతం ప్రపంచదేశాలు ప్రాణాంతక మహమ్మారి కరోనా దెబ్బకు విలవిలలాడిపోతున్న సంగతి తెలిసిందే. కరోనా పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు. అంతలా కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ఎక్కడో చైనాలోని వూహాన నగరంలో వెలుగుచూసిన కరోనా ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజల మనుగడకు గండంగా మారింది. వ్యాక్సిన్ లేని ఈ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు దేశదేశాల శాస్త్రవేత్తలు రాత్రి, పగలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ కనుగొనే దిశగా పరిశోధనలు ముమ్మరం చేశారు.
మరోవైపు కంటికి కనిపించని కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేల్ అయ్యాయి. అయితే ఈ కరోనా సెగ నాలుగు దశాబ్దాలుగా మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న ఈనాడు సామ్రాజ్యంకు తగిలిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దిన పత్రిక ఈనాడులో ఉద్యోగమంటే అదో బ్రాండ్ అనే తరహాలో ఉండేది. కానీ, ఇప్పుడు అదే ఉద్యోగుల పాలిట శాపంగా మారినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఒక రోజు ముందుగానే సంస్థ ఉద్యోగులకు వేతనాలు వచ్చేవి.
కొన్ని సందర్భాల్లో అయితే.. నెల చివరి రోజు ఆదివారం వస్తే.. ఒకట్రెండు రోజుల ముందే జీతాలు ఇచ్చేయటం జరుగుతుంది. కానీ, ఈ కరోనా కాలంలో 8వ తేదీన జీతాలను సిబ్బంది ఖాతాల్లో జమ చేస్తోంది. అది కూడా ఒక్కొక్కరికీ ఒక్కోలా కోత కోస్తోంది. అంతేకాదు, కరోనా వేళ సిబ్బందికి లేఆఫ్ ప్రకటించడం మాత్రం రామోజీరావుకు ఏమాత్రం కరెక్ట్ కాదనే భావన వ్యక్తమవుతోంది. సంస్థ కోసం కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకు ఇలాంటి కష్టకాలంలో ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.
లేఆఫ్ అంటే పనిచేసిన రోజుకే జీతం.. లేకుంటే జీతం ఇవ్వరు. అంతేకాదు, వీళ్లకు నెలలో అన్ని రోజులు పని ఇవ్వరు. నెలలో కొన్ని రోజులు మాత్రమే పని కల్పిస్తారు. అన్ని రోజులకే జీతం ఇస్తారు. దీంతో సదరు ఉద్యోగులకు దినదిన గండంగా మారిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రామోజీరావుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.