కోల్​కతా నైట్​రైడర్స్​కు తాను కెప్టెన్​గా ఉన్ననాటి సంగతులను గుర్తుచేసుకున్నాడు సౌరభ్ గంగూలీ. అప్పట్లో జట్టుపై తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వమని జట్టు సహ యజమాని షారుఖ్​ ఖాన్​ను అడిగినా అది కుదరలేదని వెల్లడించాడు.కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆ జట్టు బాధ్యతల్ని పూర్తిగా తనకు వదిలేయమని కోరినా అది జరగలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ వెల్లడించాడు. ఇటీవల గౌతమ్‌ గంభీర్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కేకేఆర్‌కు కెప్టెన్ అయ్యాక 2011లో ఆ జట్టు సహ యజమాని, బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని చెప్పాడు. ఈ విషయంపై స్పందించిన దాదా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చాడు.

 

 

ఐపీఎల్‌లో అత్యుత్తమ జట్లుగా ఏవైతే ఉన్నాయో వాటికి ఆయా ఫ్రాంఛైజీల యాజమాన్యాలు ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చాయి. మీరు చెన్నైని చూడండి. ధోనీ ఎలా నడిపిస్తున్నాడో. అలాగే ముంబయిలోనూ రోహిత్‌ దగ్గరికి వెళ్లి ప్రత్యేక ఆటగాళ్లనే తీసుకోమని ఎవరూ చెప్పరు" అని దాదా తెలిపాడు.అలాగే 2009లో తనని కేకేఆర్‌ కెప్టెన్‌గా తొలగించడానికి గల కారణాలను కూడా మాజీ సారథి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. "అప్పుడు నన్ను కెప్టెన్‌గా తొలగించడానికి కోచ్‌ జాన్‌ బుచనన్‌ ఆలోచనా విధానమే కారణం. మా జట్టులో నలుగురు కెప్టెన్లు అవసరమని అతననుకున్నాడు. అది కేవలం అభిప్రాయభేదం మాత్రమే. అలా నలుగురు సారథులు ఉంటే అతనే జట్టును నడిపించగలననే ధీమాతో ఉన్నాడు" అని గంగూలీ అసలు విషయం వెల్లడించాడు.

 

 

ఐపీఎల్‌ తొలి సీజన్‌ పూర్తవగానే జట్టులో సమస్యలు మొదలయ్యాయని దాదా తెలిపాడు. అది కేవలం కెప్టెన్సీ విషయంలో నెలకొన్న గందరగోళమేనన్నాడు. బ్యాటింగ్‌కు, ఫీల్డింగ్‌, బౌలింగ్‌కు ఇలా అన్ని విభాగాల్లో బుచానన్‌ ఒక్కో కెప్టెన్ ఉండాలనుకున్నట్లు పేర్కొన్నాడు. దాంతో జట్టు సారథిగా తానెందుకు ఉండాలనే ప్రశ్న ఎదురైందని గంగూలీ గుర్తుచేసుకున్నాడు. ఇదిలా ఉండగా, ఆ జట్టులో తొలినాళ్లలో ఆడిన ఆకాశ్‌చోప్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పటి కోచ్‌ బుచానన్‌కు గంగూలీని కెప్టెన్‌గా ఉంచడం నచ్చలేదని చెప్పుకొచ్చాడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: