గాలిద్వారా కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని ఇప్పటికే ప్రకటించిన ప్రపంచ ఆరోగ్యసంస్థ మరికొన్ని కీల విషయాలను వెల్లడించింది. గాలిద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటివరకూ కరోనా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారానే వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతూ వచ్చింది. అందుకు అనుగుణంగానే రెండు గజాల దూరం పాటించాలని కోవిడ్ ప్రోటోకాల్ లో పెట్టింది.
అయితే గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తోందనడానికి సరైన ఆధారాలున్నాయంటూ నిపుణులు డబ్ల్యూహెచ్ ఓకు లేఖ రాశారు. దీనిపై అధ్యయనం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ గాల్లో వైరస్ 8 గంటల పాటు యాక్టివ్గా ఉంటుందని తెలిపింది. అయితే కొన్ని ప్రాంతాల్లోనే వైరస్ ఎక్కువగా ఉన్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ ప్రమాదాన్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది.
రెస్టారెంట్లు, మ్యూజిక్ కన్సార్టియంలు, జిమ్ ట్రైనింగ్ సెంటర్లలో మాత్రమే వైరస్ గాలిలో వ్యాపించే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. రద్దీ ఎక్కువగా ఉండే ఇండోర్ ప్రదేశాలు, ఎక్కువ వెంటిలేషన్ లేని ప్రాంతాల్లో వైరస్ సోకిన వ్యక్తుల నుంచి ఇది మరింతమందికి వ్యాపించే అవకాశాన్ని కొట్టిపారేయలేమంది డబ్ల్యూహెచ్ ఓ. దీనిలో భాగంగా డబ్ల్యూహెచ్ ఓ సవరించిన కరోనా మార్గదర్శకాల్ని విడుదల చేసింది.
ఎలాంటి లక్షణాలు లేని వ్యక్తుల వల్ల కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందనే శాస్త్రవేత్తల సంఖ్య పెరుగుతోంది. దీనిపై కూడా డబ్ల్యూహెచ్ఓ వివరణ ఇచ్చింది. వైరస్ని వ్యాప్తి చేయగల సామర్థ్యం ఎసింప్టమేటిక్ వ్యక్తులలో ఉన్నప్పటికీ, ఇది చాలా అరుదుగా జరుగుతుందని మరోసారి స్పష్టం చేసింది. ఎక్కువశాతం వైరస్ సోకిన వ్యక్తులు మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారానే వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు పునరుద్ఘాటించింది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. . రెస్టారెంట్లు, జిమ్ ట్రైనింగ్ సెంటర్లలో వెంటిలేషన్ సరిగ్గా ఉండాలే జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది డబ్ల్యూహెచ్ ఓ. ఎక్కడ ఉన్నా సరే... ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కోరింది.