తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేత‌పై విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. స‌చివాల‌యం నిర్మాణంపై సెంటిమెంట్ అంశాలు కూడా తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. తాజాగా, సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ మ‌రో ముఖ్య‌మైన అంశాన్ని ప్ర‌స్తావించారు. స‌చివాల‌యం కూల్చివేత స‌మ‌యంలో నిజాం నవాబులు పొగిడే వాళ్లు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయ‌న కోరారు. ``తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా నిజాం నవాబును  అనేక సందర్భాల్లో పొగిడారు. నిజాం నవాబు వారసులు నాకు ఫోన్ చేసి మీరు  నిజాం నవాబును విమర్శిస్తున్నారు మంచిది కాదని హెచ్చరించారు. ఇప్పుడు నేను వారికి చెప్పదలుచుకున్నది ఏంటంటే నిజాం 6వ నవాబ్ మహబూబ్ అలీఖాన్ మేనమామ అయినా సర్ వికార్ ఉల్  ఉమ్రా ఆలోచన ప్రకారం లండన్ రాజప్రసాదం దగ్గర బకినింగ్ హోమ్ ప్యాలెస్ నమూనాతో  ఆరవ నిజాం సచివాలయంలో ఒక భవనాన్ని కట్టాడు. అలాంటి ప్రాముఖ్యత కలిగిన భవనాన్ని పురావస్తు శాఖకు అప్పగించినట్లయితే బాగుండేది. ఇలాంటి భవనాన్ని కూడా పడగొడితే హైదరాబాద్ ప్రాముఖ్యత ఏమి కనిపిస్తుంది. పురాతన భవనాలు కూలగొట్టడం సరైన పద్ధతి కాదు. వాటిని పురావస్తు శాఖకు అప్పగించి సంస్కృతిని కాపాడాలి.`` అని నారాయ‌ణ సూచించారు.

 

తెలంగాణ సీఎం కేసీఆర్ శకం నుంచి హైదరాబాదు నిర్మాణం అయినట్లు చూపిస్తున్నారని నారాయ‌ణ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ``గతంలో నిజాం నవాబు పరిపాలన గాని, పది మంది ముఖ్యమంత్రులు పాలించినట్లు గాని చెప్పకుండా నేనే హైదరాబాద్  నిర్మించినట్లు చూపించాలని ఉద్దేశంతో కేసీఆఆర్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర సచివాలయానికి అన్ని హంగులతో భవనాన్ని కట్టడానికి  నేను ఎలాంటి అభ్యంతరం పెట్టడం లేదు. కరోనా కేసులలో భారతదేశంలోనే హైదరాబాద్ కూడా స్థానం సంపాదించుకుంది. కోవిడ్ తో బాధపడుతున్న ప్రజలను కాపాడాల్సింది పోయి కొత్త సచివాలయం పడగొట్టడం అంటే మానవత్వ వ్యతిరేక చర్యే. దీన్ని ఖండిస్తున్నాం. ఇప్పుడు సరైన సమయం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్‌లో పడుకున్నారు. ఆయనకు కోవిడ్ వచ్చిందని ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. కానీ ఆయనకు వచ్చిందని నేనేమీ అనుకోను. ఆయన చాలా తెలివైనవారు.  ప్రజలందరికీ కోవిడ్ తెప్పిస్తారు గాని  ఆయన తెచ్చుకోరు. కోవిడ్ పేషెంట్లకు సచివాలయంలో చికిత్స అందించాలి. కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చావు అప్పుడు పెళ్లి చేసుకోవడం తప్ప మరొకటి కాదు.`` అని వ్యాఖ్యానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: