తెలంగాణ సచివాలయం కూల్చివేతపై విమర్శల పరంపర కొనసాగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ నేతలు విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. తాజాగా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్రెడ్డి పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ మూఢనమ్మకాలు, వాస్తు సెంటిమెంట్ కోసం సెక్రటేరియట్ కూల్చివేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఆదేశాల మేరకే సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి సెక్రటేరియట్లో నల్ల పోచమ్మ గుడిని, మసీదును కూల్చి వేశారని… ఈ ముగ్గురిపైనా క్రిమినల్ కేసులు పెట్టి చర్లపల్లి జైలుకు పంపాలన్నారు.
వాస్తు పేరుతో కేసీఆర్ రూ.వందల కోట్లు వృథా చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సెక్రటేరియట్లో 16 మంది సీఎంలు పని చేశారని, వారి కొడుకు ఎవరూ సీఎంలు కాకపోవడమే వాస్తు దోషంగా కేసీఆర్ భావిస్తున్నారని అన్నారు. కేటీఆర్ను సీఎం చేసేందుకే మూఢనమ్మకాల పేరిట వాస్తు కోసం సెక్రటేరియట్ కూల్చివేస్తున్నారని విమర్శించారు.‘నల్లపోచమ్మ గుడి, మసీదును కుల్చారు. తెలంగాణ ఉద్యమానికి నల్లపోచమ్మ గుడి వేదికైంది. కేసీఆర్ వాటిని కూల్చి ఆ వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారు’ అని చెప్పారు.
సెక్రటేరియట్లోని మజీద్, మందిరాన్ని కూల్చడాన్ని బ్లాక్ డే గా భావిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్తో మాట్లాడి సచివాలయంలో మజీద్ను తానే నిర్మించినట్లు తెలిపారు. అయినా అసలు సెక్రటేరియట్కే రాని సీఎం కేసీఆర్కు కొత్త సచివాలయం ఎందుకని ప్రశ్నించారు. తన వారసుడు కేటీఆర్ను సీఎంను చేయడం కోసమే మూఢ నమ్మకంతో..కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ ను నిర్మిస్తున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. మజీద్, మందిర్లను కూల్చుతున్న సీఎస్, డీజీపీపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రణాళికలో భాగంగామే మజీద్ను కూల్చటాన్ని అసదుద్దీన్ స్వాగతించారని ఆరోపించారు. సొంత దుకాణాలను నడుపుకోవటానికి మతం పేరుతో వేల మంది ప్రాణాలను బలితీసుకున్న చరిత్ర ఎంఐఎం, బీజేపీలది అని ఆయన ఆరోపించారు.